AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ఓదెల పెద్దపల్లి జులై 27 అక్షరం న్యూస్ రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా భారీ ధర్నాను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని తక్షణమే స్పందించి సాగునీరు, విద్యుత్, ఎరువుల కొరత వంటి ప్రతిష్టంభనలను తొలగించాలని డిమాండ్ చేశారు. అసలే తీవ్ర వర్షం పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న రైతులను మార్కెట్లో వ్యాపారులు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీకి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సెంటర్లలో రూ. 266.50 కి లభించాల్సిన యూరియా బస్తాను ప్రైవేట్ ఫెర్టిలైజర్ దుకాణాల్లో చట్టవిరుద్ధంగా రూ. 320కి, డిఏపి బస్తాలను రూ.1350కి బదులు రూ.1750కి, ఎన్పీకే (NPK) బస్తాలను రూ. 1400 కి బదులు రూ. 2300వరకు అధికధరలకు విక్రయిస్తూ వ్యాపారులు రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా యూరియా కోసం వచ్చే రైతులకు బలవంతంగా ఇతర ఎరువులు అంటగడుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే ప్రైవేట్ దుకాణాలపై తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగమైన కన్నెపల్లి మోటార్లను వెంటనే ప్రారంభించి రైతన్నలకు సాగునీరును అందించాలని కోరారు. అప్రకటిత విద్యుత్ కోతల వల్ల వ్యవసాయ మోటర్లు కాలిపోయి రైతులు ఆర్థిక నష్టాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. 2014 ముందు రైతులు రాష్ట్రంలో ఎదుర్కొన్న విద్యుత్ సమస్యలను ప్రస్తుత అదే కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి గుర్తు చేస్తుందన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అందించినట్లు నిరంతర 24గంటల ఉచిత విద్యుత్ ను నాణ్యమైన త్రీ ఫేస్ ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న పంట విక్రయించిన రైతులకు బర్దాన్ సంచుల డబ్బును వారి ఖాతాల్లో వెంటనే జమ చేయాలని కోరారు. అనంతరం రైతుల ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంగళ తిరుపతిరెడ్డి, నూనేటి సంపత్, మోహన్ రావు, సందీప్ రావు, మార్కు లక్ష్మణ్, మల్లేశం బైరం రామ్ రెడ్డి, రాజమల్లు, గణపతి, కొయ్యడ సతీష్ గౌడ్ సలేంద్ర రాములు, విన్నం రవీందర్ పెంచాల శ్రీధర్, పూదరి చంద్రశేఖర్, స్వామి విక్రమ్ గౌడ్, బాబురావు, శ్రీనివాస్, పడాల సతీష్ గౌడ్, తీగల సదయ్య, చీకటి పోచాలు, ముత్యాల రాజయ్య, రామ్ రెడ్డి, సర్పంచులు గొడుగుల సతీష్, చొప్పరి ఆంజనేయులు, కొండల్ రాజు, తాడిచెట్టు చామంతి శ్రీకాంత్, శ్వేతా వెంకటేష్, ఆకుల శ్రీనివాస్ గౌడ్, మెడగొని శ్రీకాంత్, దేవయ్య, నూనెటి కుమార్ యాదవ్, లవన్, బాలసాని శ్రీనివాస్ గౌడ్ తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు..
.
Aksharam Telugu Daily