DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : దొమ్మటి రాజేష్ పెద్దపల్లి అక్షరం ప్రతినిధి;. జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా జరుగుతున్న ప్రాణనష్టాన్ని తగ్గించి, ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా గమ్యానికి చేరాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని రూపొందించామని పెద్దపల్లి జిల్లా పోలీస్ కమిషనర్ భూక్య రామ్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పది రోజులపాటు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ భూక్య రామ్రెడ్డి గురువారం అక్షరం ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ఈ కార్యక్రమం వెనుక ఉన్న ఆలోచన, అమలు విధానం, లక్ష్యాలను వివరించారు. రోడ్డు ప్రమాదాలపై పోలీస్ శాఖ గట్టి దృష్టి ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే, ఎక్కువ శాతం ప్రమాదాలు మానవ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని డీసీపీ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్, సీటుబెల్ట్ వాడకంలో అలసత్వం వంటి కారణాలే ప్రమాదాలకు ప్రధాన కారణాలన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు శిక్షలతో పాటు అవగాహన అత్యంత అవసరమని భావించి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. పది రోజుల ప్రణాళికతో కార్యాచరణ ఈ అవగాహన కార్యక్రమాన్ని ఒకటి రెండు రోజులకు పరిమితం చేయకుండా, పది రోజులపాటు నిరంతరంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని డీసీపీ వివరించారు. గ్రామాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, జాతీయ రహదారులు, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు, మార్కెట్ ప్రాంతాలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, ఫంక్షన్ హాళ్లు వంటి చోట్ల ప్రజలను నేరుగా కలుసుకుని అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు, యువతే మార్పుకు నాంది రోడ్డు భద్రతపై యువతలో చైతన్యం వస్తే సమాజం మొత్తం మారుతుందన్న నమ్మకంతో విద్యార్థులు, యువకులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని డీసీపీ తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తూ, రోడ్డు భద్రత నిబంధనలు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ప్రాముఖ్యతను వివరించామని చెప్పారు. భవిష్యత్తులో వాహనాలు నడిపే వారే ఈ యువత కావడంతో, ఇప్పుడే అవగాహన కల్పించడం ఎంతో అవసరమని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని డీసీపీ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే, అవగాహన ద్వారా మార్పు తీసుకురావాలని పోలీస్ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడితే జైలు శిక్ష, జరిమానాలు తప్పవని, ప్రాణాలకు విలువ కట్టలేమని ప్రజలు గ్రహించాలని ఆయన అన్నారు. బాధిత కుటుంబాల అనుభవాలు హృదయాన్ని కదిలిస్తున్నాయి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులతో, గాయపడిన బాధితులతో నేరుగా మాట్లాడుతున్నామని డీసీపీ తెలిపారు. వారి అనుభవాలు, బాధలు వింటే ఎవరి హృదయమైనా కదిలిపోతుందని, ఇది ప్రజల్లో ఆలోచన మార్పుకు దోహదపడుతుందని చెప్పారు. ఈ ప్రత్యక్ష సంభాషణల ద్వారా ప్రజల్లో బాధ్యత భావం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల భాగస్వామ్యంతోనే విజయం ఈ కార్యక్రమంలో పోలీసులు మాత్రమే కాకుండా మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు, డ్రైవర్లు, రైతులు, వ్యాపారులు, మత పెద్దలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములుగా ఉండాలని డీసీపీ కోరారు. రోడ్డు భద్రత అనేది పోలీసుల ఒక్కరి బాధ్యత కాదని, సమాజం మొత్తంగా ముందుకు వస్తేనే ప్రమాదాలను తగ్గించగలమని అన్నారు. ‘అరైవ్ అలైవ్’ ఒక ఉద్యమంగా మారాలి ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక అవగాహన కార్యక్రమంగా కాకుండా, ప్రజా ఉద్యమంగా మార్చాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యమని డీసీపీ భూక్య రామ్రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ఇతరులను కూడా ప్రోత్సహిస్తేనే నిజమైన మార్పు సాధ్యమవుతుందని అన్నారు. జిల్లాలో ఒక్క ప్రాణం కూడా అనవసరంగా పోకుండా చూడాలన్నదే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమ ఆత్మ అని డీసీపీ తెలిపారు.
..
Aksharam Telugu Daily