AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల అక్టోబర్ 12/ అక్షరం న్యూస్/------మాతృ భూమిపై మమకారంతో తన దాతృత్వం చాటుకున్నారు ఎన్ ఆర్ ఐ దంపతులు. తాము ఎంతో సుదూరంలో ఉన్నా తీరికలేని జీవనం సాగిస్తున్నా వారి మనస్సు మాత్రం ఎప్పుడూ చర్ల పైనే ఉంటుంది. జన్మభూమిని వీడి మూడు దశాబ్దాలు దాటినా వారికి పుట్టిన గడ్డపై మమకారం తగ్గలేదు. అవసరం వచ్చినప్పుడల్లా నేనున్నానంటూ ఇక్కడి వారికి కావాల్సిన ఆర్దిక సహాయం అందించి తమ సేవాభావం చాటుకుంటున్నారు డాక్టర్ పసుపులేటి రామకృష్ణ - డాక్టర్ మిత్రవింద దంపతులు. ఆదివారం డాక్టర్ రామకృష్ణ మాతృమూర్తి సూర్యకాంతం వర్దంతి సందర్భంగా వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం కు ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్ ను అందచేసారు. ఈ సందర్భంగా ఆదివారం విద్యార్ది నిలయంలో జరిగిన కార్యక్రమంలో వనవాసీ గౌరవ సలహాదారులు బివిఎస్ఎల్ నరసింహారావు మాట్లాడుతూ రామకృష్ణ మిత్రవింద వారి కుమారులు భువన్ కృష్ణ, నిర్మల్ కృష్ణ లు గత ఏడాది సైతం విద్యార్దులకు నెల రోజులకు సరిపడా కిరణా సామాన్లను అందచేసిన విషయాన్ని గుర్తుచేసారు. ఈ ఏడాది కూడా గుర్తుంచుకొని తన మాతృమూర్తి జ్ఞాపకార్థం ఆర్వో వాటర్ ఫ్యూరిపైయర్ అందించడం అబినందనీయమని అన్నారు. వాతావరణ పరిస్దితుల కారణంగా గత ఆగస్టులో పలువురు విద్యార్దులు అనారోగ్యం బారిన పడ్డారని ఆనారోగ్య సమస్యకు త్రాగునీరు కూడా ఒక కారణమని గుర్తించిన రామకృష్ణ విద్యార్దుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు స్వఛ్చమైన నీరు అందించాలనే లక్ష్యంతో వాటర్ ఫ్యూరిఫైయర్ అందించారన్నారు. రామకృష్ణ తండ్రి కొండలరావు చర్లలో అనేక సంవత్సరాల పాటు జి జి సి సేల్స్ మెన్ గా అంకితభావంతో విధులు నిర్వహించి తన సేవలను అందచేసారని గుర్తుచేసారు. తండ్రి నుంచి అందిపుచ్చుకున్న అంకిత భావాన్ని కుమారుడు పునికిపుచ్చుకొని సేవా గుణంతో ముందుకు సాగడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది దాతలు ముందుకు వచ్చి గిరిజన విద్యార్దుల చదువులకు సహకరించాలని పిలుపునిచ్చారు. గిరిజన విద్యార్దులకు చదువులో వెన్నుదన్నుగా నిలిచి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో సహకరించాలని విజ్ఞప్తి చేసారు. ప్రతివ్యక్తి తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలను వినియోగించాలని కోరారు. విద్యార్దులు సైతం దాతలు అందచేస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్బోధించారు. క్రమశిక్షణతో చదివితే భవిష్యత్ బంగారుమయంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. చదువుకునే సమయంలో సుఖపడితే ఆ తర్వాత జీవితాంతం కష్డపడతారని అదే చదుకునే వయసులో కష్టపడిడే జీవితాంతం సుఖపడతారనే విషయాన్ని ప్రతి విద్యార్ది గమనించాలన్నారు. పాఠశాలలో ఉపాద్యాయులు బోధించే పాఠ్యాంశాలను శ్రద్ధతో ఆలకించి విద్యపై దృష్టి సారించడం ద్వారా ఉన్నత స్దితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వనవాసీ నిలయ కమిటీ అద్యక్షులు తాటి పాపారావు కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ, ఉపాద్యక్షులు గోగికార్ రామలక్ష్మణ్ సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు కమిటీ సభ్యులు శివరాజు కిషోర్ బుర్రా సత్యనారాయణ మూర్తి, లవన్ కుమార్ రెడ్డి యాదాల సందీప్ నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న కుమారి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily