DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఫిబ్రవరి 10 అక్షరం న్యూస్; మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న వేళ… నిన్నటివరకు నువ్వా నేనా అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న అభ్యర్థులే, తీరా పోలింగ్కు గంటల ముందు ఒక్కటయ్యారు. లక్ష్యం ఒక్కటే… ఒకే ఒక్క అభ్యర్థిని ఓడించడం! ఈ అరుదైన రాజకీయ పరిణామం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో చోటుచేసుకుంది. వేర్వేరు పార్టీల గుర్తులతో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు, అకస్మాత్తుగా ఒకే వేదికపైకి రావడం ఇప్పుడు పెద్దపల్లి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల బరిలో నలుగురు… కానీ పోరు ఒక్కరితోనే? 15వ వార్డులో ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ (ఐఎఫ్బీ) తరఫున – కొలిపాక శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి –నెత్తట్ల కొమురయ్య బీఆర్ఎస్ నుంచి – నెత్తట్ల సతీష్ బీజేపీ నుంచి – పెంజర్ల రాకేష్ తోపాటు స్వతంత్ర అభ్యర్థిగా జంగం చంద్రకుమార్ ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ మొదలుకొని మంగళవారం వరకు ప్రతి అభ్యర్థి తమ గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం, వాల్ పోస్టర్లు, వాహన ర్యాలీలతో వార్డును హోరెత్తించారు. కానీ పోలింగ్ సమయం దగ్గర పడే సరికి రాజకీయ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. స్థానికేతరుడనే కారణమా? లేక లోతైన రాజకీయ వ్యూహమా? వార్డులో పోటీలో ఉన్న ఐఎఫ్బీ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ స్థానికేతరుడు అనే వాదనను ముందుకు తెచ్చి, అతన్ని గెలవనివ్వకూడదనే లక్ష్యంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఒక్కటయ్యారని ప్రచారం జరుగుతోంది. నిన్నటివరకు ప్రత్యర్థులుగా ఉన్న నెట్టేట్ల కొమురయ్య (కాంగ్రెస్), నెట్టేట్ల సతీష్ (బీఆర్ఎస్), పెంజర్ల రాకేష్ (బీజేపీ) అనూహ్యంగా ఒకే అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకే సామాజిక వర్గం… ఒకే వ్యూహం? ఇక్కడ మరో కీలక అంశం ఏమిటంటే… ఈ ముగ్గురు అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. ఈ సామాజిక సమీకరణే ఈ అనూహ్య ఐక్యతకు కారణమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చైర్మన్ పదవే అసలు టార్గెట్? ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఉన్న కొలిపాక శ్రీనివాస్ రెండు ప్రధాన పార్టీల కీలక నేతలకు కొరకరానికి కోయగా మారినట్టుగా ప్రచారం జరుగుతోంది. అతడికి చెక్ పెట్టేందుకే అంతర్గతంగా మంతనాలు జరిపి, ఒకే అభ్యర్థి పోటీలో నిలిచేలా వ్యూహం అమలు చేసినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రజాస్వామ్యమా? రాజకీయ కుట్రా? ఒక్క అభ్యర్థిని ఓడించేందుకు మూడు పార్టీల ఏకాభిప్రాయం ప్రజాస్వామ్యంలో అరుదైన దృశ్యమా? లేదా అధికార, పదవుల కోసం కుదిరిన రాజకీయ ఒప్పందమా? ఈ ప్రశ్నలకు సమాధానం పోలింగ్ ఫలితాలే చెప్పాలి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం… 15వ వార్డు రాజకీయాల్లో ఈ ఎన్నిక ఓ మామూలు పోరు కాదు… ఇది వ్యూహాల యుద్ధం
.
Aksharam Telugu Daily