AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/ఆగస్టు 30/అక్షరం న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా / చేయూత పెన్షన్లకు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు రేపే (ఆగస్టు 31) చివరి తేదీ అని కౌన్సిలర్ పోనగంటి విష్ణువర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలు ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తన అధికారిక సర్క్యులర్ లో స్పష్టం చేసిందన్నారు. 57 ఏళ్లు నిండిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కల్లుగీత, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన వారు వెంటనే మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, బర్త్ లేదా స్టడీ సర్టిఫికెట్, ఫోటో తీసుకెళ్లాలని చెప్పారు. ఒక ఇంటిలో 57 సంవత్సరాలు నిండిన వారు ఇద్దరు ఉంటే అందులో ఒక్కరే పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవాలని, ఒక ఇంటి నుంచి ఇద్దరు దరఖాస్తు చేసుకుంటే పరిశీలనలో ఒకటి తొలగించబడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. కాబట్టి అర్హులైన లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేడే దరఖాస్తు చేసుకోవాలని కౌన్సిలర్ పోనగంటి విష్ణువర్ధన్ కోరారు.
.
Aksharam Telugu Daily