D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : --- ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 12 (అక్షరంన్యూస్) ఠాగూర్ సీన్ రిపీట్ - మృతదేహానికి చికిత్స" అంటూ సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలను నమ్మవద్దని, అటువంటి తప్పుడు వార్తలు రాసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఖమ్మంలోని సాయిరాం ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ జంగాల సునీల్ కుమార్ అన్నారు. ఐఎంఏ నాయకులతో కలిసి ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ జంగాల సునీల్ కుమార్ మాట్లాడుతూ... సాయిరాం హాస్పిటల్ పై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచురించి ప్రజల్లో అభద్రతాభావాన్ని కలిగించే విధంగా చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. 13 సంవత్సరాల బాలుడు కామెర్లు, తీవ్రమైన లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నాటు వైద్యం తీసుకుంటూనే హైదరాబాద్ స్థాయిలో అనేక ఆసుపత్రులు చుట్టూ తిప్పారని, కొన్ని రోజులపాటు ఓ దేవాలయంలో ఉంచారని పేషంట్ కండిషన్ తీవ్రతరం కావడంతో తమ ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలిపారు. ఆ సమయంలో ఐసీయూలో ఉన్న పేషెంట్ బ్రతికే ఉండి కాళ్లు చేతులు ఆడించటం పేషంటు బంధువులు చూశారని తెలిపారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా బంధువులకు చూపించామని రోగి తీవ్రవిషమ పరిస్థితిలో ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తీసుకు వెళ్ళమని రిఫర్ చేశామని తెలిపారు. పేషెంట్ ను తీసుకు వెళుతున్న క్రమంలో మార్గమధ్యమంలో చనిపోయాడని తెలిపారు. తమ ఆసుపత్రి పై తప్పుడు ప్రచారం చేసేందుకు "ఠాగూర్ సినిమా రిపీట్ - మృతదేహానికి చికిత్స" అంటూ సోషల్ మీడియా గా అసత్య ప్రచారం చేశారని, తప్పుడు వార్తలు రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు రాసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐఎంఏ నాయకులు డాక్టర్ కంభంపాటి నారాయణరావు, డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ లు మాట్లాడుతూ... డాక్టర్లు తమ వృత్తి ధర్మంలో భాగంగా పేషంటును బతికించడానికి ప్రయత్నం చేస్తారే తప్ప ప్రాణాలు తీయడానికి కాదని అన్నారు. పేషంటు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బాధితులకు ముందే చెప్పడం జరిగిందని, జరిగిన పరిణామంపై డాక్టర్లను దోషులుగా చిత్రీకరించాలనుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా, వివరణ తీసుకోకుండా ఆసుపత్రులు, డాక్టర్లపై తప్పుడు వార్తలు రాసి బదనాం చేయాలనుకోవడం అవివేకం అని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, డాక్టర్ జంగాల స్వాతి, డాక్టర్ విజస్ వర్మ, డాక్టర్ సుజేంద్ర రెడ్డి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ రవికుమార్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily