D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్/ జూలై 25 (అక్షరంన్యూస్) ప్రతి ఫీవర్ కేసును వైద్య సిబ్బంది ఫాలో అప్ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, శుక్రవారం సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ* సీజనల్ వ్యాధుల వ్యాప్తి అరికట్టేందుకు పారిశుద్ద్య నిర్వహణ చాలా కీలకమని అన్నారు. మండలంలో వైద్య అధికారి, ఎంపిడిఓ, ఎంపిఓ సమన్వయంతో పని చేయాలని, క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు ఫీల్డ్ లెవల్ అందుబాటులో ఉండాలని అన్నారు. సీజనల్ వ్యాధులు లక్షణాలు గల వారికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, వ్యాధికి గురైన వారికి చికిత్స అందించడంతో పాటు ఆ ప్రాంతంలో ఫీవర్ సర్వే నిర్వహించాలని, ఆ ప్రాంతంలో 150 ఇండ్లకు అన్ని వైపులా ఫాగింగ్ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఆశా కార్యకర్త వద్ద 20 ఆర్.టి.జి. నిర్ధారణ కిట్లను అందించాలని, ఫీవర్ సర్వే సమయంలో లక్షణాలు గల వారికి క్షేత్ర స్థాయిలో పరీక్షలు నిర్వహించేలా చూడాలని అన్నారు. ఆశా కార్యకర్తలు గ్రామాలలో ఎక్కడ గుంతలు, నీటి నిల్వ ఉన్నచోట్ల దోమలు వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో డెంగ్యూ పాజిటివ్ కేసు ప్రైవేట్ ఆస్పత్రిలో నమోదైన మనకు సమాచారం అందేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి ఆసుపత్రి ఔట్ పేషెంట్ లో నమోదయ్యే ఫీవర్ కేసులను ఈ.పి.హెచ్.ఎం.ఎస్. పోర్టల్ లో నమోదు చేయాలని, ఫీవర్ కేసులను ఏ.ఎన్.ఎం. లు ఫాలో అప్ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. లోతట్టు ప్రాంతాలలో రెగ్యులర్ గా వైద్య క్యాంపులు ఏర్పాటు చేయాలని అన్నారు. డెంగ్యూ నిర్ధారణ జరిగిన ప్రతి పేషంట్ కు అవసరమైన చికిత్స కట్టుదిట్టంగా అందించాలని అన్నారు. పి.హెచ్.సి వద్ద అవసరమైన మందులు, లిక్విడ్స్ అందుబాటులో పెట్టాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్యనిర్వహణకు స్థానిక సంస్థల అధికారులు అత్యంత ప్రాధాన్యత కల్పించాలని, ప్రతి రోజూ పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని అన్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండే డ్రైనేజీలు, ఇతర గుంతలలో పెద్ద ఎత్తున ఆయిల్ బాల్స్ వేయాలని అన్నారు. రాబోయే 2 వారాల్లో ప్రతి గ్రామపంచాయతీ ఓ.హెచ్.ఎస్.ఆర్. దగ్గర పరీక్షలు నిర్వహించాలని అన్నారు. వాటర్ ట్యాంకర్ లను రెగ్యులర్ గా శుభ్రం చేయాలని, త్రాగునీటి క్లోరినేషన్ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలో కలుషిత త్రాగునీటి సంబంధిత సమస్యలు ఎక్కడా రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఉండే విద్యా సంస్థల్లో పారిశుధ్య నిర్వహణకు స్థానిక సంస్థలు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో రెగ్యులర్ హెల్త్ చెకప్ నిర్వహించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు అరికట్టడంలో ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కళావతి బాయి, డీపీఓ ఆశాలత, డి.సి.హెచ్.ఎస్. డా. రాజశేఖర్,డిప్యూటీ సిఈఓ నాగపద్మజ, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఆసుపత్రి సూపరింటెండెంట్లు, ఎంపీడీఓలు, వైద్య అధికారులు, ఎంపీఓలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily