D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ జనవరి 29 అక్షరం (న్యూస్) ఎన్నికల నియమ, నిబంధనల ప్రకారం అప్రమత్తంగా ఉంటూ విధులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఖమ్మం రూరల్ మండల ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏదులాపురం మున్సిపాలిటీ వార్డుల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. అభ్యర్ధులు సమర్పించిన నామినేషన్ పత్రాలను పరిశీలించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, హెల్ప్ డెస్క్ లో అన్నిరకాల ఫామ్స్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నియమ, నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు కీలక ఘట్టమని, నామినేషన్ పత్రాలలో ప్రతి అంశాలు సరిగా ఉన్నాయో, లేవో జాగ్రత్తగా నిబంధనల ప్రకారం చూడాలని తెలిపారు. జిల్లాలోని ఏదులాపురం, వైరా, కల్లూరు, మధిర, సత్తుపల్లి ఐదు మున్సిపాలిటీ లలో నామినేషన్లు దాఖలు ప్రక్రియ సజావుగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ కు విధిగా కొత్త బ్యాంక్ ఖాతా తీసుకునే విధంగా వారికి తెలియజేయాలని సూచించారు. వార్డు సభ్యుడు పోటీ కోసం అదే వార్డు సభ్యుడు ప్రపోజర్ గా ఉండాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల్లో పోటీచేయు అభ్యర్థులకు సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రాలు, ప్రచార వాహనాల అనుమతులను తీసుకోవాలంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు. వార్డు సభ్యుల నామినేషన్ దాఖలును రోజు వారిగా నమోదు చేయాలని అన్నారు. అభ్యర్థుల యొక్క అన్ని వివరాలు నామినేషన్ పత్రాలలో నమోదు చేసేందుకు అవగాహనకు హెల్ప్ డెన్స్ లో నివృత్తి చేసుకోవచ్చని, ప్రతి చిన్న అంశాన్ని, అనుమానాలకు తావులేకుండా పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించుటకు అధికారులు సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఖమ్మం రూరల్ మండల తహసీల్దారు రాంప్రసాద్, ఏదులాపురం మున్సిపల్ కమీషనర్ మున్వర్ అలీ, ఎంపిడీవో, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily