D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 11 (అక్షరంన్యూస్) అడవుల సంరక్షణ అటవీ అమర వీరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం నందు అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అటవీ సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ గురువారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, డి.ఎఫ్.ఓ. సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి పాల్గొన్నారు. అటవీ అమరవీరుల స్థూపం వద్ద జిల్లా కలెక్టర్ పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల సంస్మరణార్థం రెండు నిమిషాల మౌనం పాటించి, అటవీ– వన్యప్రాణి రక్షణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. 2022లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో శ్రీనివాస్ రావు అనే అటవీ అధికారి అకాల మరణం చెందారని, వారి మరణం తనను చాలా కలిచి వేసిందని అన్నారు. కొత్తగూడెం జిల్లాలో వివిధ హోదాలలో పనిచేసే సమయంలో అటవీ పరిరక్షణ మీద అనేక సమస్యలు పరిశీలించానని అన్నారు. అడవుల సంరక్షణకు నిర్విరామంగా కృషి చేస్తున్న అటవీశాఖ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అటవీ శాఖ సిబ్బందిని కలెక్టర్ సైలెంట్ హీరోస్ గా అభివర్ణించారు. అటవీ పరిరక్షణ కోసం వీరోచితంగా రాత్రి, పగలు అటవీశాఖ సిబ్బంది పనిచేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అడవులు నరుక్కుంటూ పోతే మన మనుగడ కష్టం అవుతుందని, మానవ జీవన విధానంలో చెట్లు చాలా కీలకమని అన్నారు. ఖమ్మం జిల్లా అడవులకు, వన్య ప్రాణులకు నిలయంగా ఉందని, జిల్లాలోని వన సంపద కాపాడే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఖమ్మం జిల్లాలో అనేక చోట్ల డిజిటల్ డిటాక్స్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మన జిల్లా అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రతి రెండు నెలలకు ఒకసారి ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించి అటవీ శాఖకు అవసరమైన సహాయ, సహకారాలు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బందికి జోహార్లు అర్పిస్తూ అటవీ అమరవీరుల స్ఫూర్తితో అడవుల సంరక్షణకు అధికారులంతా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. అటవీ అమరవీరుల త్యాగం మనందరికీ స్ఫూర్తి అని వారి ఆదర్శాన్ని అనుసరించి మనం ప్రకృతి–వన్యప్రాణులను కాపాడుకోవాలని అన్నారు. అటవీ సంరక్షణ ఒక బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యమని తెలిపారు. అనంతరం అటవీ సిబ్బందికి సంరక్షణ పరికరాలు, రెయిన్ కోర్టులు, స్టిక్ గార్డ్స్ లను కలెక్టర్ పంపిణీచేశారు. జిల్లా మ్యానటరింగ్, అటవీ రక్షణలో వినియోగించే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. సీసీ కెమెరా పనితీరు ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, అటవీ అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily