AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జూన్ 04 అక్షరం న్యూస్ ప్రజారోగ్యాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్ లో నియోజకవర్గంలోని లబ్దిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు, పెద్దపల్లి మండలం, మున్సిపాలిటీ పరిదిలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్ చెక్కులను విప్ విజయ రమణారావు శనివారం అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విజయ రమణారావు మాట్లాడుతూ వైద్య, సంక్షేమ, అభివృద్ది రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. ఆపదలో ఉన్న ఎందరికో సిఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య సహాయం అందించామని తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అభివృద్ది, సంక్షేమం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందుందన్నారు. ప్రజల కోసం నిరంతరం పని చేసేది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ అమలు చేస్తున్న ఘనత సిఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలులో పరుగులు పెట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. రేవంత్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలు స్వాగతిస్తున్నారు వివరించారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, డిప్యూటీ తహసీల్దార్ విజేందర్, మార్కెట్ చైర్మన్ కూర మల్లారెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily