GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్/సిద్దిపేట జులై 08(అక్షరం న్యూస్) దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదిగి రాష్ట్రానికి ఖ్యాతి తీసుకు రావాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, డైరీ, ఫిషరీస్ మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి క్రీడాకారులకు సూచించారు. రాష్ట్రమంత్రివర్యులు వాకిటి శ్రీహరి, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రిలు పొన్నం ప్రభాకర్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక క్రీడాకారులు, విద్యార్థులతో క్రీడా సౌకర్యాలపై మాట్లాడి క్రీడల అభివృద్ధికి ఏం కావాలో అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొదటి మంత్రివర్గ సమావేశంలోనే క్రీడ పాలసీని ప్రకటించి అంతర్జాతీయ స్థాయిలలో మరియు ఒలంపిక్ గేమ్స్ లో రాష్ట్ర క్రీడాకారులు పథకాలు సాధించి రాష్ట్రానికి విశ్వవ్యాప్తంగా పేరు తేవాలనే ఉద్దేశంతో క్రీడల అభివృద్ధికి 600 కోట్ల నుండి 700 కోట్ల రూపాయల బడ్జెట్లో పెట్టారని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారుల ఎదగడానికి సాధారణమైన కృషి సరిపోదని క్రీడలే శ్వాసగా భావించి నిరంతరం సాధన చేస్తేనే సాధ్యమవుతుందని క్రీడాకారులుగా ఎదగడానికి అవసరమైన మౌలిక వసతులను ప్రభుత్వ సమకూరుస్తుందని ఇష్టమైన క్రీడారంగాలలో 13, 14 మరియు 15 సంవత్సరాల నుండే కఠినంగా శ్రమిస్తే దేశం గర్వించదగ్గ క్రీడాకారులు ఎదుగుతారని తెలిపారు. హుస్నాబాద్ ప్రాంతంలో విద్యార్థులు, క్రీడాకారులు చాలా ఆసక్తిని కనపరుస్తున్నారని, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మరియు క్రీడాకారుల ఆకాంక్ష మేరకు హుస్నాబాద్ లో స్విమ్మింగ్ పూల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా అన్ని పాఠశాలల్లో క్రికెట్, వాలీబాల్ తదితర అన్ని రకాల స్పోర్ట్స్ కిట్స్ ని అందిస్తామని తెలిపారు.రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ క్రీడలకు పెట్టింది పేరు అని, హుస్నాబాద్ నుండి కబడ్డీ, ఖో-ఖో క్రీడలతో పాటు ఇతర క్రీడలలో రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక మంది క్రీడాకారులు ఎదగారాని అన్నారు. ప్రతి గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని దాన్ని స్థానిక విద్యార్థులు, యువకులు ఉపయోగించుకోవాలని అన్నారు. మిగతా రంగాలతో పాటు హుస్నాబాద్ క్రీడల్లో కూడా ముందు వరుసలో ఉండాలని, క్రీడాకారులు భవిష్యత్తులో అన్ని క్రీడల్లో హుస్నాబాద్ నుండి ప్రాతినిధ్యం వహించి హుస్నాబాద్ ను నెంబర్ వన్ గా నిలపాలని అన్నారు. అనేకమంది పిల్లలు ఈతల కొట్టడానికి వాగులు చెరువులోకి వెళ్లి మృత్యువాత పడుతున్నారని ఇలాంటి సంఘటనలు హుస్నాబాద్ ప్రాంతంలో జరగకుండా హుస్నాబాద్ స్టేడియంలో ఒక స్విమ్మింగ్ పూల్ ను మంజూరు చేయాలని, క్రీడా సౌకర్యాలను మెరుగుపరచాలని మంత్రి వర్యులు వాకిటి శ్రీహరిని కోరారు. రాష్ట్ర క్రీడాపాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రతి నియోజకవర్గంలో క్రీడా సౌకర్యాలు మెరుగయ్యాయని, పిల్లలను చిన్ననాటి నుండే క్రీడలలో ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులుగా ఎదుగుతారని అన్నారు. జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ జిల్లాలో క్రీడల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం మినీ స్టేడియం ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమం ద్వారా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి మరియు జిల్లా కలెక్టర్ లు వారి తల్లుల పేరు మీద మొక్కలు నాటి తల్లుల పేరు మీద మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని వన మహోత్సవం కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రజలందరూ వారి వారి తల్లుల పేరు మీద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అనంతరం కబడ్డీ కోర్టులో కబడ్డీ క్రీడాకారులను పరిచయం చేసుకొని రాష్ట్ర మంత్రులు, క్రీడ ప్రాధికార సంస్థ చైర్మన్ మరియు క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ సోనీ బాలాదేవిలు స్వయంగా కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కబడ్డీ కోర్టుకు 2 మ్యాట్లను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమ అగ్రవాల్, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఆర్డిఓ రామ్మూర్తి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily