D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ నవంబర్ 10 (అక్షరంన్యూస్) ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఎర్రుపాలెం మండలం రేమిడిచెర్ల గ్రామానికి చెందిన గరికపాటి సరోజిని, తనకు రెండో లిస్టులో ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కోరుతూ దరఖాస్తు చేసుకోగా, పిడి హౌజింగ్ కి రాస్తూ తగుచర్యలు చేపట్టాలని అన్నారు. స్థానిక పంపింగ్ వెల్ రోడ్ నుండి కొండి రేఖ, తాను ఇంటర్ చదివి, కంప్యూటర్ కోర్సు చేసినట్లు, అవుట్ సోర్సింగ్ లో ఏదేని ఉద్యోగం ఇప్పించగలందులకు కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఖమ్మం డిఆర్డీవో, పిడి మెప్మా, జిల్లా ఉపాధి అధికారులకు తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం గ్రామం సర్వే నెం. 396లో స్మశాన వాటిక స్థల పరిష్కారం కోరుతూ కుల వివక్ష పోరాట సంఘం, ఖమ్మం జిల్లా కమిటీ దరఖాస్తు చేసుకోగా ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ కి రాస్తూ పరిశీలించి సమస్య పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఏన్కూరు మండలం, ఏన్కూరు గ్రామానికి చెందిన నున్నా సావిత్రి, తన భర్త నున్నా వెంకయ్య పేర ఉన్నటువంటి వ్యవసాయ భూమిని తనకు తెలియకుండా ఇతరుల పేర పట్టా చేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు భూమి అప్పగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ కు రాస్తూ నిబంధన ప్రకారం తగుచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మధిర మండలం నాగవరప్పాడు కు చెందిన వాడకుప్పలా నాగార్జున రావు, తన పొలం సర్వే పూర్తి చేసి, సరిహద్దులను గుర్తించారని, గట్టురాళ్లను వేయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, మధిర తహసీల్దార్ కు రాస్తూ తగుచర్యకు కలెక్టర్ ఆదేశించారు. నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామానికి చెందిన అమరనేని అప్పయ్య, తన కుమారుల నుండి మనోవర్తి కోరుతూ దరఖాస్తు చేయగా, జిల్లా సంక్షేమ అధికారికి తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. ఇట్టి ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ఓ ఏ. పద్మశ్రీ , డిఆర్డీవో ఎన్. సన్యాసయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily