DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : దొమ్మటి రాజేష్ పెద్దపల్లి ప్రతినిధి; పెద్దపల్లి జిల్లాలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలకు ఈ నెల 11 బుధవారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం సాయంత్రంతో ముగియగా, మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అభ్యర్థులు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీకి దిగారు. సోమవారం సాయంత్రం వరకు వార్డుల్లో పైచేయి సాధించేందుకు అభ్యర్థులు పోటాపోటీగా జనసమీకరణ, ర్యాలీలు, ఇంటింటా ప్రచారాలతో హోరెత్తించారు. ప్రచారం ముగిసిన వెంటనే తెర వెనుక రాజకీయాలు తెరపైకి వచ్చాయి. 50 ఓట్లకు ఒకరు… పూర్తి ఓటర్ల మ్యాపింగ్ ప్రతి వార్డు పరిధిలోని ఓటర్ల జాబితాను ముందుగానే సిద్ధం చేసుకున్న అభ్యర్థులు, 50 మంది ఓటర్లకు ఒకరిని బాధ్యుడిగా నియమించి డబ్బు, మద్యం పంపిణీ చేపట్టినట్టు సమాచారం. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లను సైతం రప్పించుకునేందుకు ప్రయాణ ఖర్చులు ఇవ్వడం, అవసరమైతే వాహనాలు సమకూర్చడంలో కూడా అభ్యర్థులు పోటీ పడ్డారు. డబ్బుల కోసం అభ్యర్థుల వద్దకు ఓటర్లు కొన్నిచోట్ల పరిస్థితి తారుమారైంది. తమ ఓటు ఈ వార్డు పరిధిలో ఉందంటూ ఓటర్ లిస్ట్ చేతబట్టి అభ్యర్థుల వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేసుకునే పరిస్థితి కనిపించింది. ఇంటి వద్దకు వెళ్లి ఓటు అడగాల్సిన అభ్యర్థులే, ఇప్పుడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వారి ఇళ్ల చుట్టూ తిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓటుకు నోటు కాదు… నోటుకు ఓటు! ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలు పూర్తిగా ప్రలోభాల కేంద్రంగా మారుతున్నాయి. గతంలో అభ్యర్థులు ఓటర్ల ఇంటికి వెళ్లి డబ్బులు పంచేవారు. ఇప్పుడు పరిస్థితి మారి, “మాకు ఎన్ని ఓట్లు ఉన్నాయి… అంత డబ్బు ఇవ్వండి” అని ఓటర్లు డిమాండ్ చేసే స్థాయికి చేరుకుంది. ఒక్కో ఓటుకు వేలల్లో రేటు! కొన్ని వార్డుల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు కనిష్టంగా ఓటుకు రూ.1,000 కొన్ని చోట్ల రూ.5,000 మరికొన్నిచోట్ల ఓటుకు రూ.10,000 నుండి 20,000 వరకు పంపిణీ చేసినట్టు బహిరంగంగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా కొన్ని వార్డుల్లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చయినట్టు అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి ఓటుకు ఎంత ఇస్తున్నాడో తెలుసుకొని, దానికి రెట్టింపు చెల్లించేందుకు అభ్యర్థులు వెనకాడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అంతుచిక్కని ఓటర్ నాడీ ఇదిలా ఉండగా, ఓటర్ల నాడి మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఎవరు వెళ్లి ఓటు అడిగినా మీకే వేస్తాం అంటున్నారు. ఎవరు డబ్బు, మద్యం ఇచ్చినా తీసుకుంటున్నారు. కానీ చివరకు ఓటు ఎవరికీ పడుతుందన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని కుటుంబాల్లో నాలుగు ఓట్లు ఉంటే, ఇద్దరు అభ్యర్థులకు రెండు ఓట్లు చొప్పున వేయాలన్న ఆలోచనతో ఓటర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని, వారు ఇచ్చిన మొత్తానికి అనుగుణంగా కుటుంబ ఓట్లు పంచుకోవాలని కొందరు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆన్లైన్ పంపిణీ, ప్రత్యేక క్యాడర్ కొంతమంది అభ్యర్థులు ఓటర్లను విభజించి, నగదు రూపంలోనే కాకుండా ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపిణీ చేసినట్టు సమాచారం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు, వారి ఓట్లు తమకే పడేలా ప్రత్యేక క్యాడర్ను నియమించినట్టు తెలుస్తోంది. ప్రజాస్వామ్యానికి మచ్చగా మారుతున్న ఎన్నికలు డబ్బు, మద్యం ప్రభావంతో సాగుతున్న ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య విలువలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. కోట్ల ఖర్చు చేసిన అభ్యర్థులు గెలిచిన తర్వాత ఆ డబ్బును ఎలా రాబట్టుకుంటారన్నది ఇప్పుడు ప్రజల్లో చర్చకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికలు ఫలితాల కంటే ముందు ఖర్చుల పోటీగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
.
Aksharam Telugu Daily