Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్ /సిద్దిపేట మే 05(అక్షరం న్యూస్ ) సాగు అంశాలపై రైతులకు అవగాహన కల్పించడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని హుస్నాబాద్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ హాల్లో వ్యవసాయ పరిశోధన స్థానం మరియు ఏరువాక కేంద్రం తోర్నల వారి ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా డా.ఎస్. శ్రీదేవి, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నల మాట్లాడుతూ రైతు సోదరులకు ఆరు అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా యూరియా వాడకాన్ని తగ్గించడం, రసాయనాలను అవసరం మేరకు వినియోగించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, ఖరీఫ్ లో రైతులు ఉపయోగించే విత్తనాలు కొన్నప్పుడు రసీదును భద్రపరచుకోవడం, వివిధ పంటల్లో సాగునీటిని ఆదా చేసే అవసరమైన పరిజ్ఞానాన్ని, ప్రత్యామ్నాయ పంటల వివరాలను, చెట్ల పెంపకం లాంటి అంశాలపై అవగాహన కల్పించారు. చరవాణి ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మన హుస్నాబాద్ రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని సాగు ఖర్చు తగ్గించుకుని వ్యవసాయంలో శాస్త్రీయ మెలకువలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి అన్నింటిలో ముందంజలో ఉండాలని కోరారు.తర్వాత మంత్రి ఓఎస్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గిస్తూ సమగ్ర వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని రైతులను కోరారు.తర్వాత హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ పరిశోధన మెలకువలు తెల్పడానికి హుస్నాబాద్ మండలాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సీజన్ లో కూడా 2 నుండి 3 కార్యక్రమాలు చేయాలని దానిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్యాక్స్ ఛైర్మన్ శివయ్య మాట్లాడుతూ రైతులు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు కొనుగోలు చేసినపుడు తప్పకుండా రశీదు తీసుకోవాలని మరియు పంట కాలం పూర్తి అయ్యే వరకు భద్రపర్చుకోవాలని అన్నారు.జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని కాపాడాలని, వరి కొయ్యకాళ్ళను కాల్చవద్దని కోరారు.ఈ కార్యక్రమంలో రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. హుస్నాబాద్ డివిజన్ వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ సాగు ఖర్చు తగ్గించకోడానికి సేంద్రియ ఎరువులు వినియోగం పెంచాలని నేల సమతుల్యతను కాపాడాలని, పంట దశలను బట్టి ఎరువులను 2 నుండి 3 దఫాలుగా వేసుకుని దాని వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పల్లవి, వ్యవసాయ పాలిటెక్నిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజా, మాజీ మున్సిపల్ కమిషనర్ పద్మ, కోహెడ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, హుస్నాబాద్ మార్కెట్ కమిటి డైరెక్టర్లు, మండల వ్యవసాయ అధికారి శ్రేయ, వ్యవసాయ విస్తరణ అధికారులు విజయ్, సంగీత, శివరామకృష్ణ మరియు హుస్నాబాద్ మండలంలోని117 మంది రైతులు పాల్గొన్నారు .
.
Aksharam Telugu Daily