D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ జనవరి 10 (అక్షరం న్యూస్) విద్యానగర్ కాలనీలో 4 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు, డ్రైయిన్ ల నిర్మాణం చేపట్టామని, వచ్చే సీజన్ నాటికి ఒక మీటర్ కూడా గ్యాప్ లేకుండా పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంత్రి, శనివారం ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ పరిధి ఒకటవ డివిజన్ విద్యానగర్ లో పర్యటించి 4 కోట్ల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసారు. ఈ సందర్భంగా *మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ* విద్యానగర్ కాలనీలో 4 కోట్ల రూపాయలు విలువ గల 20 సిసి రోడ్లు, 13 సిసి డ్రైయిన్ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. విద్యానగర్ కాలనీ ఏర్పడి 10 నుంచి 15 సంవత్సరాలు గడిచినా గత పాలకులు గంపెడు కాంక్రీట్ అభివృద్ధి పనులు చేపట్టలేదని, ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ప్రజా ప్రభుత్వం గత 2 సంవత్సరాలలో 12 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు మంజూరు చేశామని అన్నారు. వచ్చే సీజన్ నాటికి ఒక మీటర్ ఖాళీ లేకుండా విద్యానగర్ కాలనీలో సిసి రోడ్లు, డ్రైయిన్లు నిర్మిస్తామన్నారు. పేదలకు సంక్షేమం అందించడంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డులు జారీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. గ్రామాలు, పట్టణాలలో మౌళిక వసతుల కల్పన, సాగు నీరు, త్రాగునీటి సరఫరా పనులు ప్రాధాన్యతతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. *ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ* 4 కోట్ల రూపాయల విలువ గల 3.2 కిమి సిసి రోడ్లు, 1.5 కిలో మీటర్ల డ్రైయిన్ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఖమ్మం ఒకటవ డివిజన్ లో 9 కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టామని, సాచురేషన్ పద్ధతిలో డివిజన్ మొత్తం సిసి రోడ్లు, డ్రైయిన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒకటవ డివిజన్ కార్పొరేటర్ తేజావత్ హుస్సేన్, ఆర్ అండ్ బి ఎస్ఈ యాకోబు, ఆర్డీఓ నరసింహా రావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఖమ్మం అర్బన్ మండల తహసిల్దార్ సైదులు, మునిసిపల్ ఇంజనీర్లు, ఎన్పిడిసిఎల్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily