D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్/అక్టోబర్ /24 (అక్షరంన్యూస్) ఖమ్మం జిల్లాలో ప్రజల భద్రత, సామాజిక న్యాయం, జరుగుతున్న అక్రమాలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా నాయకత్వం రాష్ట్ర పోలీసు ప్రధానాధికారి (డీజీపీ)ని నేరుగా సంప్రదించింది. శుక్రవారం హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కో-ఇన్చార్జ్ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు లతో కూడిన జిల్లా బృందం డీజీపీని కలిసి, నాలుగు కీలక అంశాలను స్పష్టంగా ప్రస్తావిస్తూ వినతిపత్రాన్ని సమర్పించింది. వినతిపత్రంలో ప్రధానంగా నాలుగు అంశాలను నేతలు ప్రస్తావించారు. మొదటగా, అక్టోబర్ 18న సత్తుపల్లిలో జరిగిన బీసీ బంద్ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కమల్ పాషా తదితరులు బీజేపీ సత్తుపల్లి మండల అధ్యక్షులు బానోతు విజయ్ లతోపాటు కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని నేతలు ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా సాగుతున్న బంద్ కార్యక్రమానికి భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాక, కమల్ పాషా ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాడని, ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని వారు ఆరోపించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రెండవ అంశంగా, పెనుబల్లి మండలం ఎరుగట్ల గ్రామంలో ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద లబ్ధిదారుల ఎంపికలో జరిగిన భారీ అవకతవకలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు, బోర్లు ఉన్నవారికి ఇళ్లు కేటాయించడం, గుడిసెల్లో ఉన్న పేదలను నిర్లక్ష్యం చేయడం సామాజిక అన్యాయమని వారు డీజీపీ దృష్టికి తీసుకువచ్చారు. మూడవదిగా, ఖమ్మం-ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో గోవుల అక్రమ రవాణా నిరంతరం కొనసాగుతోందని, దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న గోరక్షకులు బెదిరింపులకు గురవుతున్నారని నేతలు తెలిపారు. గోవుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అలాగే గోరక్షకులకు పోలీసు రక్షణ కల్పించాలని వారు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. చివరి అంశంగా, ఖమ్మం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా కొనసాగుతుందని, ఈ విషయంపై గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అక్రమ రవాణా అలాగే సాగుతుందని నేతలు వివరించారు. ప్రధానంగా ఖమ్మం పట్టణంలో కళాశాలలు, పాఠశాలలను అడ్డాగా చేసుకుని గంజాయి వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా తిరుగుతుందని బీజేపీ తరఫున ఫిర్యాదు చేశారు. డీజీపీ వినతిపత్రాన్ని స్వీకరించి, ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చినారు. జిల్లాలో చట్టవ్యవస్థను కాపాడి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. డీజీపీని కలిసిన వారిలో నాయకులు దేవకి వాసుదేవరావు, ఈ వి రమేష్, నంబూరి రామలింగేశ్వరరావు, నాయుడు రాఘవరావు లు కూడా ఉన్నారు.
.
Aksharam Telugu Daily