AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ నవంబర్ 18 (అక్షరంన్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు.మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి తుమ్మల కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు అధికారికంగా ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన సీఎం ఖచ్చితంగా జిల్లా పర్యటనకు వస్తానని పేర్కొన్నారు. డిసెంబర్ మొదటి వారంలో పర్యటన ఖరారు.. మంత్రి తుమ్మల ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ స్పందిస్తూ డిసెంబర్ 1 నుండి 8 వరకు ఏ తేదీనైనా కార్యక్రమాన్ని చేపట్టొచ్చు. అనుకూలమైన రోజు నిర్ణయించుకుని తెలియజేస్తానని సూచించారు. దీంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారైంది. ప్రారంభోత్సవానికి సిద్ధం కావాలని ఆదేశం... సీఎం రానున్న విషయం ఖరారైన వెంటనే మంత్రి తుమ్మల, విద్య శాఖ సెక్రటరీ శ్రీధర్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు, సంబంధిత శాఖలకు తక్షణమే కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమ వేదిక, స్టేజ్, లేఅవుట్ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రోడ్డు, వసతులు, పార్కింగ్, రాకపోకలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని,భద్రత విషయాల్లో లోపాలు లేకుండా పోలీసు శాఖతో సమన్వయంతో పని చేయాలన్నారు. అతిథుల నిర్వహణ, వసతి, మీడియా సెంటర్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి తుమ్మల సూచించారు. విశ్వవిద్యాలయ భవనాలు, ల్యాబ్లు, మౌలిక వసతుల పరిశీలనకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. దేశానికే ప్రత్యేక గుర్తింపునిచ్చే వర్సిటీ... కొత్తగూడెం మైనింగ్ విశ్వవిద్యాలయం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సంస్థగా మారనుందని మంత్రి తుమ్మల తెలిపారు.300 ఎకరాల్లో నిర్మించిన ఈ వర్సిటీ, ఇప్పటికే ఆధ్యునిక ల్యాబ్లు, పరిశోధన కేంద్రాలు, అంతర్జాతీయ ప్రమాణాల విద్యా వసతులతో నిర్మించారు.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో తెలంగాణ విద్యా రంగం జాతీయస్థాయిలో కొత్త గుర్తింపు పొందనుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. మంత్రి తుమ్మల కృషితోనే సాధ్యమైన ప్రాజెక్ట్.. మైనింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేయడం, దానికి భారత మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ పేరును నిర్ణయించడం మంత్రి తుమ్మల నిరంతర కృషి వల్లే సాధ్యమయ్యాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జిల్లా అభివృద్ధికి తనదైన శైలిలో పని చేస్తున్న తుమ్మల కృషికి ప్రజలు, విద్యారంగ నిపుణులు అభినందనలు తెలియజేస్తున్నారు. యువతకు ఉపాధి.. జిల్లాకు అభివృద్ధి.. వర్సిటీ ప్రారంభోత్సవం నేపథ్యంలో వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు,యువతకు పరిశోధనా, ఉపాధి అవకాశాలు,కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, పరిశోధన సంస్థలు రావడానికి మార్గం సుగమం అవుతుందన్నారు. జిల్లాలో విద్య– పరిశ్రమల సమన్వయంతో ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
.
Aksharam Telugu Daily