GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : .. ... దొమ్మటి రాజేష్, అక్షరం ప్రతినిధి, పెద్దపల్లి: మహిళ సాధికారత, సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నా, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, కింది స్థాయి ఉద్యోగుల అవినీతి, అక్రమాల కారణంగా అవి మహిళలకు అందని ద్రాక్ష పండే అవుతుంది. వడ్డీ రాయితీపై మహిళ సంఘాలకు బ్యాంక్ల ద్వారా రుణాలు ఇవ్వడం ద్వారా వారిలో స్వయం ఉపాధి పెంపొందించి, ఆర్థిక పరిపుష్టత సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బంది వారి ధరి చేరనివ్వడం లేదు. పెద్దపల్లి మండలం హన్మంతునిపేట గ్రామంలో మహిళ సంఘాల పేరుతో వివో ఏ (విలేజి ఆర్గనైజర్ అసిస్టెంట్) ఖలీం పెద్ద మొత్తంలో లక్షల రూపాయలు బ్యాంక్ రుణాలు ఇప్పించి తన సొంతానికి వాడుకోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. వివో పరిధిలో అన్ని స్వశక్తి సంఘాల నిర్వహణ కోసం నియమించబడిన వీవోఏ సంఘ సభ్యుల అమాయకత్వాన్ని, వారి అవసరాలను ఆసరగా చేసుకొని వారికి తెలియకుండా వారిపేరుతో బ్యాంక్ రుణాలు తీసుకున్నాడనే ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే వీవోఏ ఖలీమ్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ప్రస్తుతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ఈ అంశం హన్మంతునిపేటలో చర్చనీయాంశమైంది. ఇటీవల హన్మంతునిపేట గ్రామానికి చెందిన డ్వాక్ర స్వశక్తి సంఘం సభ్యురాలు అయినా శిలువేరూ సౌందర్య తన ప్రమేయం లేకుండానే 2,40,000 గ్రామంలోనీ ఇండియన్ బ్యాంక్ ద్వారా, తన ఖాతాలో జమ చేసి, వాటిని తెలివిగా స్త్రీనిది లోన్ అకౌంట్ కు వివోఏ ఖలీం ట్రాన్స్ఫర్ చేయించినట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇది మచ్చుకి ఒక్కటే అయినా, ఇలాంటివి గ్రామంలో చాలా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆంశంపై విచారణను సంబంధిత ఉన్నత అధికారులు జాప్యం చేస్తున్నారని విమర్శలు వినవస్తున్నాయి. హన్మంతునిపేటలో విఓఏ.... మైనార్టీ హాస్టల్లో వాచ్మెన్... ఒక్కడే రెండు ఉద్యోగాలు... జీవో నెంబర్ 58 ప్రకారం గ్రామీణ పేదరిక నిర్ములన సంఘం (సెర్ఫ్) లో పని చేసే వారు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు చేయరాదు. అనే నిబంధన ఉన్నప్పటికీ హనుమంతునిపేట వివోఏ గా పని చేస్తున్నా కలీం రెండు సంవత్సరాలుగా రామగుండంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో నైట్ వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలిసినా, కూడా ఆయనను వివో ఏ పదవి నుంచి సంబంధిత అధికారులు తొలగించలేదు. ఇందు కోసం పై అధికారులకు మచ్చిక చేసుకోవడానికి దావతులు, తైలాలు ఇచ్చేవాడని ప్రచారం జరుగుతుంది. పై అధికారులు అండదండలు ఉండటంతో గ్రామంలో సంఘాలపై అజమాయిషీ పెరిగి పోయి, ఇష్ట రాజ్యంగా వ్యవహరించే వాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళ సంఘాల లీడర్ల అమాయకత్వం, అవసరాలను ఆసరగా చేసుకొని, వారికి మాయ మాటలు చెప్పి, కొంతమందికి తెలిసి, మరి కొంత మందికి తెలియకుండా సంఘాల పేరుతో బ్యాంకులో రుణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో నిత్యం పర్యవేక్షించే మండల స్థాయి సిబ్బందికి ప్రమేయం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. వీరి సహకారంతోనే లక్షల్లో తీసుకున్న రుణం డబ్బులు గోదావరిని పారిశ్రామిక ప్రాంతంలో ఫైనాన్స్ చేసినట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే సెటిల్ చేస్తామంటే అందరూ గప్.. చుప్.. హన్మంతునిపేట గ్రామంలో స్వశక్తి సంఘాల పేరుతో వివో ఏ తీసుకున్న బ్యాంకు రుణాలు లక్షల్లో ఉన్నట్టు తెలుస్తోంది. బ్రతికున్నంత కాలం ఈ విషయం బయటకు రాకుండా ఉన్నా, ప్రస్తుతం చనిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చింది. దీనితో చాలా మంది సభ్యులు బ్యాంక్ కు వెళ్ళి చూస్తే తెలిసి, తెలియక వారి పేరుతో లక్షల్లో రుణాలు ఉన్నట్లు తెలిసింది సుమారు 18 లక్షల వరక లెక్క తేలినట్టు సమాచారం. సభ్యులందరూ ఏకమై కలీం తల్లి, భార్య వద్దకు వెళ్లి అడుగుతే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కలీంకు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిన తర్వాత అందరికి సెటిల్ చేస్తామని చెప్పడంతో అందరూ ప్రస్తుతానికి గప్ చుప్ గా ఉన్నారు. ఆడిట్ చేస్తే, అన్ని వెలుగులోకి.... హన్మంతునిపేట గ్రామంలో స్వశక్తి సంఘాల రుణాలు, లావాదేవిలపై ఆడిట్ చేస్తే అన్నీ విషయాలు వెలుగులోకి వస్తాయని పలువురు పేర్కొంటున్నారు. సెర్ప్ అధికారులతో కాకుండా సహకార సంఘాల అధికారులతో ఆడిట్ చేయిస్తే ఇందులో ఎంతమందికి ప్రమేయం ఉన్నదన్నది స్పష్టంగా తెలుస్తుందని పలువురు కోరుతున్నారు. వివో, స్వశక్తి సంఘాల సమావేశాలు సకాలంలో నిర్వహించ పోవడం, వాటికి మండల స్థాయి అధికారులు హాజరు కాకపోవడం, ఆర్థిక లావాదేవీల పై సమావేశంలో చర్చించకపోవడం వంటి సెర్ఫ్ సిబ్బంది నిర్లక్ష్యంతో, సకాలంలో ఆడిట్ చేయడంలో అలసత్వం వహించడం వల్లనే ఇలాంటి పరస్థితి దాపురించిందని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా ప్రమేయం లేకుండానే నా ఖాతాలోకి డబ్బులు ... డ్వాక్ర గ్రూపు సభ్యురాలు శిలువేరు సౌందర్య తనకు తెలియకుండానే తన ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని, వివో ఏ కలీం ఓచర్ రాసుకుని నా వద్దకు వచ్చి, వేరే ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయించాడని హన్మంతునిపేట డ్వాక్రా గ్రూపు సభ్యురాలు శిలువేరి సౌందర్య తెలిపారు. ఖలీం మరణం తర్వాత బ్యాంకుకు వెళ్ళి తెలుసుకుంటే సిసిఎల్ లోన్ నుండి మా సంఘానికి 2లక్షల 40 వేల రూపాయలు మంజురు కాగా, ఆ డబ్బులు నా ఖాతాలో జమ చేసి, నాతో వాటిని శ్రీనిధి ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ లోనుకు తనకు, తన సంఘానికి ఏలాంటి సంబంధం లేదని ఇటీవల డి ఆర్ డి ఓ కు ఫిర్యాదు చేశారు. హన్మంతునిపేట సభ్యుల బ్యాంక్ రుణాలపై విచారణ > జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కాళిందిని పెద్దపల్లి మండలం హన్మంతునిపేట గ్రామంలో స్వశక్తి సంఘాల బ్యాంక్ రుణాలపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్టు జిల్లా రామీణాభివృద్ధి సంస్థ అధికారి కాళిందిని 'అక్షరం ప్రతినిధి" కి తెలిపారు. స్వశక్తి సంఘాల సభ్యుల పేరుతో ఏలాంటి అవినీతి, అక్రమాలు జరిగినా సహించేది లేదన్నారు. అవసరమైతే ఆడిట్ అధికారులతో ఆడిట్ చేయించి నిజాలను వెలికి తీస్తామన్నారు. ఈ విషయంలో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టేది లేదని, గ్రూపు సభ్యులు ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ డి ఆర్ డి ఓ భరోసా ఇచ్చారు.
.
Aksharam Telugu Daily