GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఆగస్టు 18 అక్షరం న్యూస్; పెద్దపల్లి కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బండి సతీష్ కలెక్టర్ ఎదుటే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం ప్రకారం, సతీష్ తండ్రి బండి మధుమయ్య గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత 25 ఏళ్లుగా పార్ట్టైమ్ స్వీపర్గా పనిచేశారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఆవిష్కరణ అనంతరం జెండా అవతరింపజేస్తున్న సమయంలో ఆయనను విషపురుగు కుట్టింది. దీంతో ఆయనను కరీంనగర్, వరంగల్ ఆసుపత్రికి తరలించగా, జనవరి 29న చికిత్స పొందుతూ మృతి చెందారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా విషపురుగు కాటు వల్లే మరణం సంభవించిందని వైద్యులు నిర్ధారించారు. తండ్రి మృతితో పేద చాకలి కుటుంబం దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయింది. కుటుంబానికి ఉద్యోగం, సొంత ఇల్లు కల్పించాలని సతీష్ ప్రజావాణికి హాజరై కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాడు. అయితే, తన మనవి వెంటనే పరిష్కారం కానందున ఆవేదనతో కలెక్టర్ ఎదుటే గడ్డి మందు తాగి పడిపోయాడు. అక్కడే కలెక్టరేట్లో ఉన్న అధికారులు అప్రమత్తమై అతడిని వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కలెక్టరేట్ వాతావరణం కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. నిరుపేద కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం ఉద్యోగం, ఇల్లు కల్పించి న్యాయం చేయాలని గ్రామస్తులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily