DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : దొమ్మటి రాజేష్ పెద్దపల్లి ప్రతినిధి; ప్రజలు ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన విధానమే ప్రజాస్వామ్యం కానీ నేడు ప్రజాస్వామ్యం అనేదానికి అర్థం లేకుండా పోయింది. ప్రజాస్వామ్యానికి పండుగగా చెప్పుకునే ఎన్నికలు… ఈసారి పెద్దపల్లి జిల్లాలో మాత్రం అనేక ప్రశ్నలకు కేంద్రంగా మారాయి. ఓటు విలువపై, ఎన్నికల నిర్వహణపై, అధికార యంత్రాంగ పాత్రపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికలంటే డబ్బేనా..? సేవ మాటలకేనా..? ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి, ప్రజాసేవ కంటే డబ్బు బలం ప్రధాన పాత్ర పోషిస్తున్నదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రిజర్వేషన్లు ఉన్నా సామాన్యుడికి రాజ్యాధికారం దక్కడం కష్టమవుతోందన్న వాదన ముందుకు వస్తోంది. కార్పొరేట్ శక్తుల ప్రభావం పెరిగిపోయి, స్థానిక సమస్యలు పక్కకు నెట్టబడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓటు అడగలేదని కొందరు… డబ్బులు ఇవ్వలేదని మరికొందరు ఈ ఎన్నికల్లో ఓటర్ల ప్రవర్తన కూడా చర్చనీయాంశంగా మారింది. తమను ఓటు అడగలేదని కొందరు, డబ్బులు ఇవ్వడం లేదని మరికొందరు పోలింగ్కు వెళ్లకపోవడం విశేషంగా కనిపించింది. డబ్బు ఇవ్వకపోతే ఓటు వేయనన్న భావన కొన్నిచోట్ల బహిరంగంగానే వ్యక్తమైంది. పక్కింటికి ఇచ్చారు… మాకెందుకు ఇవ్వలేదంటూ నిందలు కొన్ని వార్డుల్లో పక్కపక్క ఇళ్లలో డబ్బులు ఇచ్చి, తమకు ఇవ్వలేదని అభ్యర్థులను లేదా వారి అనుచరులను ఓటర్లు నిలదీయడం కనిపించింది. డబ్బు పంపిణీలో వివక్ష చూపారన్న ఆరోపణలతో నిరాశ, నిస్పృహ వ్యక్తమైంది. ఇది ప్రజాస్వామ్యంపై ఓటర్ల నమ్మకం ఎంతగా దెబ్బతిన్నదో సూచిస్తోంది. ‘అయ్యో రాత్రి ఇవ్వలేకపోయాం’… పోలింగ్ కేంద్రాల వద్దే పంపిణీ కొన్నిచోట్ల అయితే మరింత ఆందోళనకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ‘‘అయ్యో… రాత్రి ఇవ్వలేకపోయాం’’ అంటూ పోలింగ్కు వచ్చిన ఓటర్లకు పోలింగ్ కేంద్రాలకు సమీపంలోనే డబ్బులు పంపిణీ చేయడం గమనార్హం. ఎన్నికల నిబంధనలకు ఇది స్పష్టమైన ఉల్లంఘనగా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారులు చూసిచూడనట్టా..? ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగం చూసిచూడట్టు వ్యవహరించడమే చర్చనీయాంశంగా మారింది. అన్ని వార్డుల్లో డబ్బుల పంపిణీ జరిగినప్పటికీ, కొన్నిచోట్ల మాత్రమే డబ్బులు పంపుతున్న వారిని పోలీసులు పట్టుకోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. డబ్బు–మద్యం పంపిణీ బహిరంగ రహస్యమే పెద్దపల్లి జిల్లాలో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ జరిగిన విషయం బహిరంగ రహస్యమేనని రాజకీయ వర్గాలు, ఓటర్లు అంటున్నారు. అయినప్పటికీ చర్యలు మాత్రం ఎంపిక చేసిన ప్రాంతాలకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అస్తవ్యస్తమైన వార్డుల విభజన… ఓటర్ల గందరగోళం అస్తవ్యస్తంగా జరిగిన వార్డుల విభజన ఎన్నికల గందరగోళాన్ని మరింత పెంచింది. ఒకరికి మూడు చోట్ల ఓటు హక్కు ఉండటం, ఏళ్లుగా ప్రాంతం విడిచి వెళ్లిన వారి ఓట్లు తొలగించకపోవడం, ఓటు ఒకచోట ఉండి ఓటరు మరోచోట ఉండడం వంటి లోపాలు అభ్యర్థులను కూడా ఇబ్బందులకు గురి చేశాయి. విదేశాల్లో ఉన్నవారి నిరాసక్తత… చనిపోయినవారి ఓట్లు విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు పోలింగ్కు రావడానికి ఆసక్తి చూపకపోవడం ఒకవైపు కాగా, చనిపోయిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగడం మరోవైపు విమర్శలకు దారి తీసింది. రిజర్వేషన్ల కేటాయింపుల్లోనూ తారుమారైన పరిస్థితులు అభ్యర్థుల్లో అసంతృప్తిని పెంచాయి. ప్రశాంతమేనా..? ప్రశ్నల మధ్య పోలింగ్ అన్ని విమర్శల మధ్య పెద్దపల్లి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అధికారులు ప్రకటించినా… ప్రజాస్వామ్య నాణ్యతపై మాత్రం పెద్ద ప్రశ్నార్థకమే మిగిలింది. ఓటు విలువ కాపాడాల్సిన బాధ్యత ఎవరిది..? ప్రజాస్వామ్యం కేవలం ఓటు వేయడానికేనా..? లేక ఓటుకు గౌరవం ఉండాలా..? అన్న ప్రశ్నలు పెద్దపల్లి జిల్లాలో మారుమోగుతున్నాయి.
.
Aksharam Telugu Daily