Jakkani Rajaramesh , SIRCILLA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : " రాజన్న సిరిసిల్ల, జనవరి -22 (అక్షరం న్యూస్): మున్సిపల్ ఎన్నికలకు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకముందే సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలలో బరిలో దిగే నాయకులు ఆత్రుతతో ఎన్నికల "కోడ్" (అధికారిక ప్రకటన) రాకముందే "ఎన్నికల ప్రచారం" విస్తృతంగా చేపడుతున్నారు. మాజీ కౌన్సిలర్లతో పాటు నూతన ఆశవాహులు సైతం ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ముందస్తు పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. కొందరు లీడర్లు ప్రతి గడపగడపకు తిరుగుతూ "క్యాలెండర్లు లడ్డూలు"పంచుతూ తమ వార్డు ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ముసలి, ముతక, చిన్నారులను సైతం పలకరించుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. చరవాణిలో ప్రతిరోజు స్టేటస్ లలో ప్రచారాలు జోరుగా సాగిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకే కాకుండా ప్రతి ఒక్కరికి బహుమతులు పంచడం వెనుక ఎన్నికల పరమార్ధం ఉందని కొందరు అనుకుంటున్నారు. క్రికెట్ పోటీలు, ఆటల పోటీలను కూడా నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా మంచినీటి సరఫరా ఉండాలని బోర్లను సైతం మరమత్తులు చేయించారు. ఎన్నికలు రాకముందే ఇలా చేస్తే ఎన్నికల సమయంలో ఇంకెంత జోరుగా ప్రచారాలు విందులు, వినోదాలు పంచుతారో ఎవరెవరికి ఎంత లబ్ది చేకూరుతుందోనని వార్డు ప్రజలు ఆశతో ఎదురు చూడటం వారికి అలవాటుగా మారింది. ఏదేమైనా గెలిచిన అభ్యర్థులు తాము ఖర్చు పెట్టింది వడ్డీతో సహా రాబట్టుకోకుండా వార్డును అభివృద్ధి చేస్తే చాలని రాజకీయ విశ్లేషకులు ఆశిస్తున్నారు.
.
Aksharam Telugu Daily