DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి | ఫిబ్రవరి 15 | అక్షరం న్యూస్ పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించగా, ఇప్పుడు ఆ విజయం పవర్ స్ట్రక్చర్గా మారే దశకు చేరుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మాత్రమే మిగిలి ఉండగా, ఈ పదవుల ఎంపిక వెనుక రాజకీయ లెక్కలు, సామాజిక సమీకరణలు, భవిష్యత్ రాజకీయ లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీసీ కోటా + సంఖ్యాబలం = మల్లయ్యకు చైర్మన్ పీఠం పెద్దపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ పదవి బీసీ సామాజిక వర్గానికి కేటాయించబడటం కీలక మలుపు. ఈ కోటా పరిధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 24వ వార్డు సభ్యుడు నూగిళ్ల మల్లయ్య అన్ని విధాలా సరైన ఎంపికగా మారారు. ఒకవైపు సామాజిక వర్గ సమతుల్యత, మరోవైపు కౌన్సిలర్లలో మెజారిటీ మద్దతు మల్లయ్యకు అనుకూలంగా ఉండటం ఆయనకు బలంగా మారింది. అంతేకాకుండా, పార్టీ లోపలి విభేదాలు లేకుండా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ హైకమాండ్ దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు వ్యూహం ఏమిటి? ఈ మొత్తం ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నది చింతకుంట విజయరామరావునే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మున్సిపాలిటీలో భవిష్యత్తులో ఎలాంటి అసంతృప్తి రాకుండా, పార్టీని క్రమబద్ధంగా నడిపించగల నాయకత్వం అవసరమన్న ఆలోచనతోనే మల్లయ్య పేరును ముందుకు తెచ్చినట్లు సమాచారం. ఇది కేవలం పదవుల పంపకం కాదు, రాబోయే రాజకీయాలకు పునాది వేయడమే అన్న విశ్లేషణ వినిపిస్తోంది. వైస్ చైర్మన్గా ఈర్ల స్వరూప… సమతుల్యత రాజకీయమా? చైర్మన్ పదవి ఒక సామాజిక వర్గానికి దక్కుతుండగా, మరోవైపు వైస్ చైర్మన్ పదవిని ఈర్ల స్వరూపకు ఇవ్వడం ద్వారా పార్టీలో సమతుల్యత సాధించాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన అనుభవం, పార్టీ పట్ల విధేయత, స్థానిక రాజకీయాల్లో పట్టు — ఇవన్నీ స్వరూపకు ప్లస్ పాయింట్లుగా మారాయి. దీంతో కాంగ్రెస్ లోపలి అసంతృప్తులకు తావు లేకుండా వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పదవుల కంటే పాలనపై దృష్టి పెట్టే ప్రయత్నం ఈసారి పెద్దపల్లి మున్సిపల్ పాలనలో పదవుల కంటే స్థిరత్వం, నియంత్రణ, పాలన సామర్థ్యం ముఖ్యమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరు గొడవ పెట్టుకోకుండా, పార్టీకి నష్టం రాకుండా, ఎమ్మెల్యే ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వాన్ని ఎంపిక చేయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. నేటి ఎన్నికలతో రాజకీయ దిశ స్పష్టం సోమవారం జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలతో పెద్దపల్లి మున్సిపల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఇది కేవలం మున్సిపాలిటీ స్థాయి మార్పే కాకుండా, పెద్దపల్లి నియోజకవర్గ రాజకీయాలకు సంకేత నిర్ణయంగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
.
Aksharam Telugu Daily