అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : .. గోదావరిఖని పెద్దపల్లి జిల్లా ఏప్రిల్ 29 అక్షర న్యూస్; కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలైందని, ప్రజలు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు సోమవారం 2వ ఇంక్లైన్ లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగరేణి కార్మికులను కలిసి ఒక అవకాశం ఆయన ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు బూటకపు హామీలని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఇంకా కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని తెలిపారు. సింగరేణి కార్మిక సమస్యలు తెలిసి గుర్తిస్తాయి అవగాహన కలిగిన వ్యక్తిగా తనను ఆదరించాలన్నారు. హైదరాబాద్ కు చెందిన వీకెండ్ నాయకులకు సింగరేణి సమస్యలపై ఎలాంటి అవగాహన ఉండదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేవలం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. సింగరేణి కార్మికుడిగా స్థానికుడిగా ఒక్క అవకాశం కల్పిస్తే కార్మిక సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తానని ఆయన కార్మికులను కోరారు. సింగరేణిలో పోయిన డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకువచ్చి మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.అంతేకాకుండా సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడుతానన్నారు. హైదరాబాద్ నాయకుల వల్ల ఎటువంటి అభివృద్ధి జరగదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నా రేవంత్ రెడ్డి కనీస అవగాహన పరిజ్ఞానం లేకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి నాలుగు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలనే కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు స్వచ్ఛందంగా ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ వారి సమస్యలను వివరిస్తున్నారని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ కు చెందిన కార్పొరేట్ నాయకులకు కార్మికుల సమస్యలు ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుడి బిడ్డగా కార్మికులు ఆదరించి ఒక అవకాశం కల్పించాలని కొప్పుల ఈశ్వర్ కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు మిర్యాల రాజిరెడ్డి, మాదాసు రామ్మూర్తి పర్లపల్లి రవి తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily