అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ మార్చి.29/ అక్షరం న్యూస్; నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనదారులపై చీటింగ్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని కొత్తగూడెం పట్టణ డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలను సీజ్ చేసి అట్టి వాహనదారులపై చీటింగ్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఈరోజు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. కొత్తగూడెం వన్టౌన్, టూటౌన్ మరియు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ఈ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన ఇద్దరిపై, కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురిపై చీటింగ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లకు పాల్పడే నేరస్తులు నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను ఉపయోగిస్తున్నారని, అట్టి నేరాల నియంత్రణ, చేధన కొరకు ఈ విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. కొత్తగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంతాలలో నెంబర్ ప్లేట్లు లేకుండా గానీ, నెంబర్ ప్లేట్లు టాంపర్ చేసి గానీ ఎవరైనా పట్టుబడితే వారిపై చీటింగ్ కేసులను నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. నేరాల నియంత్రణకు పోలీసు వారు చేపడుతున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం వన్ టౌన్ సిఐ కరుణాకర్, 3టౌన్ సీఐ శివప్రసాద్, ట్రాఫిక్ ఎస్సైలు నరేష్, మదార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily