అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తల్లాడ ఏప్రిల్ 13 (అక్షరంన్యూస్) ప్రారంభానికి ముందే తల్లాడ పల్లె ప్రకృతి వనం ఖాళీ బూడిదైంది. శనివారం రాత్రి ప్రమాదవశాత్తు వనంలో గడ్డికి నిప్పు అంటుకొని ఆహుతి అయింది. గత పాలకవర్గం పట్టించుకోకపోవడం, అధికారులు కూడా చూసి చూడనట్లుగా వదిలేయటంతో లక్షలాది రూపాయల ప్రభుత్వ సొమ్ము బూడిద పాలు అయింది. గత ప్రభుత్వ హయాంలో పల్లె ప్రకృతి వనంకు లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేశారు. తల్లాడ మేజర్ పంచాయతీతో పాటు మంగాపురం, గాంధీనగర్ తండాల కలిపి ఈ పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించారు. కానీ తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గం పట్టించుకోకుండా వనంలో సౌకర్యాలు ఏర్పాట్లు నిర్లక్ష్యం చేశారు. గత ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్ గౌతమ్ ఈ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి త్వరతగతిన పూర్తి చేయాలని, ప్రజలకు అందుబాటులోకి తేవాలని పాలకవర్గాన్ని, అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ వారు పట్టించుకోకుండా నిరుపయోగంగా ఉంచటంతో గడ్డిపెరిగి అగ్నికి ఆహుతి అయింది. బూడిద అదేవిధంగా వనంలో చేసిన మొక్కలు పెరిగినప్పటికీ మంటలు ఎక్కువగా రావడంతో చెట్లన్నీ కాలిపోయాయి. దీంతో ప్రభుత్వ సొమ్ము బూడిద పాలు కావడంతో పాలకవర్గం, అధికారుల తీరుపై ఈ ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంటలను ఆర్పేసిన పైరింజన్ సిబ్బంది.. పల్లె ప్రకృతి వనం కాలిపోతుందన్న విషయం తెలుసుకున్న ఫైర్ ఇంజన్ అధికారులు హుటా హుటీన చేరుకొని మంటలను ఆర్పేశారు. ఫైర్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నాగులు మీరా, రవితోపాటు సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పేశారు. వారితో పాటు స్థానిక గ్రామపంచాయతీ సిబ్బంది, మంటలను ఆర్పటంలో సహాయం అందించారు.
.
Aksharam Telugu Daily