Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : - చొప్పదండి /కరీంనగర్, సెప్టెంబర్ 14( అక్షరం న్యూస్ ) రుక్మాపూర్ ఆదర్శ పాఠశాల కు నిత్యం 17 గ్రామాల నుండి 350 బాలికలు, 100 బాలురు మొత్తం 450 మంది డే స్కాలర్స్ గా వస్తున్నారని వీరికి రెండు బస్ లు మాత్రమే ఉన్నందున ఒక్కో బస్సు రెండు ట్రిప్పు లు వేయవలసి రావడం తో మొట్ట మొదటి గ్రామ విద్యార్థి ఉదయం 7 గంటలకు బస్ లో బయలు దేరితే చిట్ట చివరి గ్రామానికి బస్సు సాయంత్రం 7 గంటలకు చేరుతుందని, కావున విద్యార్థుల ఇబ్బందులు దృష్టి లో ఉంచుకుని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని అదనపు బస్ మంజూరు చేయించాలని చొప్పదండి తాజా మాజీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో విద్యార్థుల తల్లి తండ్రులు ముఖ్యమంత్రి, రవాణా మంత్రి, జిల్లా కలెక్టర్, స్థానిక శాసన సభ్యులు మేడిపల్లి సత్యం కు రాసిన పదహారు వందల విజ్ఞాపన ఉత్తరాలను పోస్ట్ బాక్స్ లో వేస్తూ పోస్ట్ బాక్స్ ఉద్యమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ మూడు కోసుల దూరంలో ఉన్న ఆదర్శ పాఠశాలకు వెళ్ళడానికి మూడు గంటల సమయం పట్టడం బాధాకరమని భారత, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఏ దేశం లో కూడా పాఠశాల విద్యార్థులు ఇంటి నుండి బడి కి చేరడానికి మూడు గంటలు ప్రయాణించడం లేదని రుక్మాపూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థుల ఇడుములను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. ఆదర్శ పాఠశాలల్లో చదివే విద్యార్థులు నూటికి నూరు శాతం దళిత బహుజనులైతే అందులో 80% బాలికలని బడుగు బలహీన వర్గాల విద్యను, బాలికా విద్యను ప్రోత్సహించవలసిన ప్రభుత్వం బడికి వెళ్ళే విద్యార్థులకు బస్ కేటాయించకుండా వారి విద్యకు మోకాలడ్డటం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వ తీరు వలన అనేక మంది విద్యార్థిని విద్యార్థులు వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలలకు కళాశాలలకు వెళ్తున్నారని అదనపు బస్ కేటాయించి రుక్మాపూర్ మోడల్ స్కూల్ ను నిజమైన ఆదర్శ పాఠశాల గా నిలపాలని ముఖ్యమంత్రి కి, రవాణా మంత్రికి, జిల్లా కలెక్టర్ కు స్థానిక శాసన సభ్యులు మేడిపల్లి సత్యం కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉడుత రమేష్ జేరిపోతుల లక్ష్మి, సందనవేణి కొమురయ్య, నీలి లక్ష్మణ్, నీలి మల్లయ్య, బసరవేని తిరుపతి, దీకొండ లచ్చయ్య, గసిగంటి రవి, యామ గంగయ్య, తీగల పరమేష్ ఎరుకల తిరుపతి గౌడ్, ముంజాల అశోక్, బోనగిరి శ్రీనివాస్, మామిడి కనకయ్య దుర్ముట్ల గంగరాజు, గుండె వెంకటేష్ , బొగ్గుట్ల ముని తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily