Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : ... మహబూబాబాద్ /గార్ల /జులై 27/అక్షరం న్యూస్... ప్రతిష్ఠాత్మకంగా పల్లె ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం లక్షల నిధుల వెచ్చించి సుందరమైన సువిశాలమైన అన్నీ వసతులతో కూడిన పల్లె దవాఖానలను కట్టించి,సరిపడ సిబ్బందిని నియమించి,జీతాలు,పనిముట్లు,వైద్య సామాగ్రి,మందులు,మెయింటనెన్సు అలవెన్సులు ఇచ్చి ప్రజలకు కనీస ఆరోగ్య అవసరాలు తీర్చజూస్తుంటే స్థానిక గార్ల మండలంలోని పెద్దకిష్టాపురం గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖానతో మాత్రం తమకు ఏమాత్రం ప్రయోజనం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మీ సేవే మా లక్ష్యమని-మేమున్నాము,మీరు ధైర్యంగా వచ్చి వైద్యం చేయించుకొమ్మని ప్రజలకేనాడు నమ్మకం కల్గించిన పాపాన ఇక్కడి సిబ్బంది పోలేదంటున్నారు.ఈ దవాఖానలో పనిచేస్తున్న సిబ్బంది ఇక్కడ నియామకమైనప్పటి నుండి నేటికీ స్థానికంగా నివాసముండక, అందుబాటులో అసలుండక,ఖమ్మం నుండి నిత్యం రాకపోకలు చేస్తుంటారు.విచిత్రమైన విషయం ఏమిటంటే గత ఒక సంవత్సరం కాలంగా ఈ పల్లె దవాఖానలో వైద్యుడు లేరు.గ్రామంలో విషజ్వరాలు,డెంగీ కేసులు పెరిగాయని గ్రామస్థులు ఆందోళన చేపట్టి,డియం.అండ్ హెచ్ వో దృష్టికి తీసుకెళ్లి మెడికల్ క్యాంపులనేర్పాటు చేసినపుడు మాత్రమే కొంత మంది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కనపడి,మిగతా వేళల్లా అపరిచితమే అన్నట్టుంది.వేలకు వేల జీతాలు తీసుకుంటూ,ఏజన్సీ పల్లె ప్రజల అనారోగ్యాలను బేఖాతరు చేస్తూ వైద్య వృత్తికే కళంకం చేస్తున్నారని ప్రజలు నిర్భయంగా మాట్లాడుకుంటున్నారు.ఏదో ఒక సమయంలో హెల్మెట్ల ధరించుక వచ్చి,రిజిష్టరులో సంతకాలు చేసుకుని వెళుతున్నా,గిరిజన ప్రజలింకా చోద్యం చూస్తూనే ఉన్నారు.ఆస్పత్రి చుట్టూ పిచ్చి మొక్కలు,సిరంజీలు,వైద్య వేస్టులు, కుళాయి లేని నల్లా కనెక్షను, అద్దాలు పగిలిన కిటికీలు,నీటితో నిండే నిరంతర మురికి గుంటలతో పరిసరమంతా మురికిమయమైనా ఈ సిబ్బందికి మాత్రం పట్టదు.కురుస్తున్న వర్షాలకు పల్లెలో ఇంటికో ముగ్గురు చొప్పున విషజ్వరాల బారినపడి గార్ల, మహబూబాబాద్, ఖమ్మం వంటి పట్టణాలకు గిరిజనులు దారులు కడుతున్నారు.ఇంత జరుగుతున్నా పల్లె దవాఖాన తెరిచినా దాఖలాలు లేవు, ఎంత నిర్లక్ష్యం అంటే తమకెవరు ఏమి చేయలేరనే ధీమాతో మొక్కుబడిగా సేవలందిస్తున్నారు.ప్రయివేట్ వైద్యం తో ప్రజలు ఆర్ధికభారంతో సతమతమవుతున్నారు.సూదిమందుకి గానీ మందుబిళ్ళకి గానీ ఆసరా లేక,ఏనాడూ తిమోఫాస్ వంటి దోమల మందులు పిచికారీ చేయక,దోమతెరల పంపిణీ చేయక,ఫ్రైడే-డ్రైడేలు,శానిటేషన్ నిర్వహించక,పేదలకు నెలవారీ బి.పి,షుగరు మాత్రలు ఇవ్వక,రోగాల నివారణపై ప్రజల చైతన్యపర్చని ఈ దవాఖాన గానీ,ఈ సిబ్బంది గానీ మాకెందుకని పల్లె ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.దేనికీకొరగానిదానిగా ఆస్పత్రిని మార్చి,కర్తవ్యాన్ని మర్చిన ఈ సిబ్బంది మాకొద్దని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.అలాగే ఇక్కడి సిబ్బంది పనితీరుపై ప్రజాక్షేత్రంలో సమగ్ర విచారణ జరిపి,వారు ఏమాత్రం పనిచేయక తీసుకున్న జీతాలను,ప్రభుత్వం రికవరీ చేసి,తగు శాఖాపరమైన చర్యలు తీసుకుని,వారిని స్థానచలనం కలిగించాలని స్థానిక ప్రజానీకం కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily