Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రాబోయే రెండు రోజుల్లో జిల్లాకు భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని సూచించారు. వరద నీటితో ప్రమాదకరంగా మారిన రోడ్లను దాటడానికి ప్రయత్నం చేయొద్దని సూచించారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, నదులు, చెరువుల వద్దకు చూడటానికి వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని తెలిపారు. వర్షాలు తగ్గే వరకు వ్యవసాయ పనులకు , పశువులు కాయడానికి వెళ్లకుండా ఉండాలని సూచించారు. ఇతర శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా పోలీసు శాఖ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా అకస్మాత్తుగా వాగులు, నదులలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని,అవసరమైతే ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఎవరికైనా విపత్కర పరిస్థితి ఎదురైతే వెంటనే డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను పొందాలని తెలియజేసారు.
-
Aksharam Telugu Daily