Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహబూబాబాద్ /గార్ల /జులై 18/అక్షరం న్యూస్... మహబూబాబాద్ జిల్లా,గార్ల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ముప్పై పడకల ఆసుపత్రి లో పూర్తి స్దాయిలో వైద్యులను, సిబ్బంది ని నియమించాలని ఐద్వా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు కందునూరి కవిత డిమాండ్ చేశారు. వైద్యులు, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా )గార్ల మండల కమిటీ అధ్వర్యంలో మూడు రోజుల నిరాహార దీక్షలు అనంతరం మానుకోట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అందోళన నిర్వహించారు. అనంతరం కందునూరి కవిత మాట్లాడుతూ, వైద్య మరియు ఆరోగ్య శాఖ ఉన్నతధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం తో వైద్యులు, సిబ్బంది కొరత ఏర్పడిందని అన్నారు. పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడం మూలంగా ఏజెన్సీ ప్రాంతమైన గార్ల మండల ప్రజలు అరకొర సేవలతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బందిని నియమించాలని గతంలో అనేక దఫాలుగా అధికారులకు విన్నవించిన ప్రయోజనం లేదని అన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది ని నియమించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ అదైత్వ కుమార్ సింగ్ కు ఆసుపత్రి సమస్యలపై వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో ఐద్వా మండల అధ్యక్ష, కార్యదర్శులు మల్లెల నాగమణి,అలవాల సత్యవతి, నాయకులు చింత మౌనిక, తాళ్లపల్లి రమా, కందునూరి సుజాత, వంగూరి పద్మ, బానోత్ ఝాన్సీ, బాడిశ లక్ష్మి వంగూరి మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily