Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/ తల్లాడ జూలై 12 (అక్షరంన్యూస్) తల్లాడ పట్టణంలో కుప్పల తెప్పలుగా ఉన్న చెత్తను, మురికి నీరు సంబంధిత అధికారులు తొలగించకపోవడంతో ప్రజలు వ్యాధులు బారిన పడుతున్నారు. గత రెండు, మూడు రోజులుగా పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ తల్లాడ మండల అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. భారీగా వర్షాలు కురుస్తుండటంతో మురికి నీరు రోడ్లపై నిల్వ ఉండి దోమలు విజృంభిస్తున్నాయి. వీటికి తోడు సైడు కాలువల పక్కన పిచ్చి మొక్కలు భారీగా ఉండటంతో దోమల వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. దోమల నివారణకు ఫాగింగ్, బ్లీచింగ్ కూడా చల్లకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. భయంకరమైన డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులు సోకుతున్నప్పటికీ అధికారుల్లో మాత్రం చీమకుట్టినట్లుగా కూడా చలనం లేదు. గతంలో డెంగ్యూ జ్వరంతో అనేకమంది చిన్న వయసులోనే మృత్యువాత పడ్డ సంఘటనలు అనేకం ఉన్నాయి. వీటితోపాటు ప్రజలు గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారుల దగ్గరకు వెళ్లి విన్నవిస్తుంటే ప్రభుత్వం నుండి నిధులు రావడం లేదని సాకుతో పనులను ఆటకెక్కిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ తల్లాడ మండల అధికారుల్లో మాత్రం తీరు మారటం లేదు. కనీసం చిన్నచిన్న సమస్యలను కూడా పరిష్కరించటం లేదని ప్రజలు వాపోతున్నారు. నిత్యం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి దాపురించిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. తల్లాడ మండలం పై జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు, జిల్లా మంత్రులు దృష్టి పెట్టి సంబంధిత మండల అధికారులపై చర్యలు తీసుకొని, మండల సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily