Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/తల్లాడ జూలై 15 (అక్షరంన్యూస్) తల్లాడ మేజర్ పంచాయతీ నర్సరీ అధ్వానంగా తయారయింది. జూన్ లో మొక్కలతో కళకళ డాల్సిన నర్సరీ మొక్కలు లేక మోడులతో వెలవెల పోతుంది. జులైలో వనం మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే సమయం ఆసన్నమైనప్పటికీ అధికారులు మొక్కలు నాటడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు మండల కేంద్రమైన తల్లాడలోనే మొక్కలు నాటే పరిస్థితి లేదు. అసలు నర్సరీని అధికారులు పట్టించుకున్న పాపాన పోవటం లేదు. వర్షపు నీరు వస్తే చుట్టుపక్కల నీరు చేరి చెత్తాచెదారాలతో దుర్గంధం వెదజల్లుతుంది. నర్సరీలో పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. వన మహోత్సవంలో భాగంగా ఇటీవల సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి తల్లాడ పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఆ మొక్కలు కూడా తల్లాడ నర్సరీ నుండి కాకుండా ఎక్కడివో ఆప్పటికప్పుడు తీసుకొచ్చి వేసినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. నర్సరీలో ఎండ, కోతులు రక్షణకు షెడ్డు చుట్టూ క్లాత్ ఏర్పాటు చేయాల్సి ఉండగా అవి అసంపూర్తిగా వదిలేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించారు. అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి చేతులమీదుగా సత్తుపల్లిలో వనమహోత్సవాన్ని నిర్వహించారు. జిల్లాలో మంత్రుల పర్యవేక్షణలో ఊరూరా మొక్కలు నాటించాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మంత్రులు సత్తుపల్లి నియోజకవర్గంలో నాటినప్పటికీ ఆ నియోజకవర్గంలో ఉన్న తల్లాడ మండలంలో మొక్కలు నాటడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. గతంలో ఈ నెలలో మొక్కలను ట్రాక్టర్ పై తీసుకువచ్చి ఒక్కో మనిషికి నాలుగు మొక్కలు చొప్పున పంపిణీ చేసిన అధికారులు ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా వారు ఏడాది మొక్కలు పెంచడంతోపాటు పంపిణీ చేయటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇకనైనా తీరు మార్చుకొని అధికారులు పనిచేయాలని, నేను పక్షంలో ఉన్నతాధికారులు ఈ మండలాధికారులపై చర్యలు తీసుకొని పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily