AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / వరంగల్ జిల్లా : అక్షరం ప్రతినిధి వరంగల్ వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్లే జాతీయ రహదారి మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 85 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ హైవే ద్వారా వరంగల్ నుంచి కరీంనగర్ మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. నాలుగు లైన్లలో నిర్మాణమవుతున్న ఈ జాతీయ రహదారి ఈ ఏడాది చివరి కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. నేషనల్ హైవే-163కిది అనుసంధానం కానుంది. పలివెల్పుల శివారులో మొదలుకొని ఎల్లాపూర్, ఎల్కతుర్తి, తిమ్మాపూర్, కేశవపట్నం నుగునూర్ గుండా మానకొండూర్ బైపాస్ వరకు కొనసాగుతుంది. హైవేపైకి వాహనాలు ఎక్కడ ప్రవేశించాలంటే : వరంగల్ నుంచి కరీంనగర్ మధ్య 68 కిలోమీటర్ల పొడవుతో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆధ్వర్యంలో రూ.1,641 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణమవుతోంది. ఇందులో 23 వెహికల్ అండర్ పాస్లు, 121 బ్లాక్ కల్వర్టులు, మానకొండూర్ దగ్గర బైపాస్, తిమ్మాపూర్ వద్ద చిన్న బ్రిడ్జి, శంకరపట్నం దగ్గర కల్వర్టులున్నాయి. హనుమకొండ నుంచి ఎర్రగట్టు గుట్ట దగ్గర పరకాల రోడ్డు, గంటూర్పల్లి రోడ్డు, హసన్పర్తితో పాటు ఎల్లాపూర్ వద్ద నుంచి ఈ కొత్త హైవే పైకి వాహనాలు ప్రవేశించొచ్చు. అందుబాటులోకి వస్తే ప్రయోజనాలెన్నో : ఈ రోడ్డు నిర్మాణంతో జాతీయ రహదారి-563 మార్గంలోని వరంగల్ నుంచి కరీంనగర్ మధ్య దూరం తగ్గుతుంది. నాలుగు లైన్లతో ఏర్పాటు కానుండటంతో ప్రధానంగా అనేక సరకుల రవాణా వాహనాలకు ఉపయుక్తం కానుంది. గతంలో వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్లాలంటే సుమారు రెండున్నర గంటల సమయం పట్టేది. ఇకపై దీని ద్వారా గంట వరకు తగ్గే అవకాశం ఉంది. దీంతో భారీగా ఇంధన ఖర్చు తగ్గడంతో పాటు చాలా సమయం కూడా ఆదా అవనుంది. ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు : రహదారి వెంట రెండు ఉమ్మడి జిల్లాల ఇండస్ట్రియల్ కారిడార్ మరింత పురోగతి సాధించనుంది. ముఖ్యంగా గ్రానైట్ పరిశ్రమలతో పాటు భవన నిర్మాణాలకు అవసరమైన ఎన్నో రకాల సరకుల రవాణాకు ఈ రహదారి అనువుగా మారనుంది. పరిసర జిల్లాల విద్యార్థులకు విద్య, వైద్య శిక్షణ సంస్థలు నెలకొల్పేందుకు అనుకూలంగా మారనుంది. రోడ్డు పొడవునా పలు రకాల ముడి, వ్యవసాయాధార పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడనున్నాయి. రహదారి పరిసర గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయాధారిత పరిశ్రమలకు సంబంధించిన ఎగుమతులు, దిగుమతులకు ఈ హైవేే ఎంతో దోహదపడనుంది. ఇరు జిల్లాల పర్యాటకానికి సులభం :ఈ నాలుగు లైన్ల రహదారి అందుబాటులోకి వస్తే వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని పర్యాటకం కూడా మరింత అభివృద్ధి కానుంది. వరంగల్లోని చారిత్రక కట్టడాలైన వేయి స్తంభాల గుడి, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, కరీంనగర్లోని ఎలగందల కోట, ప్రముఖ జలాశయాలు వీక్షించేందుకు ప్రయాణం సులభం కానుంది. ఈ నేషనల్ హైవే పొడవునా వివిధ రకాల చెట్లను పెంచనున్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు పలు ప్రాంతాల్లో ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నారు
.
Aksharam Telugu Daily