Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : . భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / మార్చ్ 1 / అక్షరం న్యూస్ : - శనివారం సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లు, డిఆర్డిఓ, డిడబ్ల్యుఓ, డిసిహెచ్ఎస్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ లతో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ మాట్లాడుతూ... సదరం ధ్రువీకరణ పత్రాల కోసం యుడిఐడి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా దివ్యాంగులకు అవగాహన కల్పించాలన్నారు. గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ, విఎల్ఇ కేంద్రాలను ఆశ్రయించేవారని, ఇప్పుడు వీటితోపాటు యుడిఐడి పోర్టల్ , స్వంత మొబైల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ మరియు స్లాట్లు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. క్యాంపుల వివరాలు కూడా సందేశం (మెసేజ్) ద్వారా తెలియజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ ప్రక్రియను మార్చి, 2025 మాసం నుండి అమల్లోకి తీసుకురావడం జరిగిందని, 21 రకాల వైకల్యం కలిగిన వారు యుడిఐడి ( యూనిక్ డిజాబ్లిటీ ఐడి ) కార్డును పొందవచ్చని ఆమె తెలిపారు. సదరం కార్డును కూడా పోస్టల్ ద్వారా అభ్యర్థులకు చేరవేయడం జరుగుతుందని ఆమె అన్నారు. గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కలిగి ఉన్నవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, వారికి ప్రస్తుతం ప్రభుత్వపరంగా అందుతున్న పథకాలు వర్తిస్తాయని ఆమె పేర్కొన్నారు. దివ్యాంగులు ఎలాంటి అపోహలకు గురికాకుండా వారికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో సదరం క్యాంపులను నిర్వహించేందుకు 38 మెడికల్ బోర్డులను గుర్తించడం జరిగిందని ఆమె తెలిపారు. సదరం క్యాంప్ నిర్వహించే సందర్భాల్లో దివ్యాంగులకు అసౌకర్యం కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు నిమిత్తం రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంపై మీసేవ నిర్వాహకులకు శిక్షణను ఇవ్వాలని సేర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ అధికారులకు సూచించారు. పీఎం కుసుం ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్ లను ఏర్పాటు చేసుకునేందుకు గ్రామీణ మహిళా సంఘాలను ప్రోత్సహించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ తెలిపారు. ఆసక్తి ఉన్న వారి నుండి దరఖాస్తు స్వీకరించి స్థలాలను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఐడిఓసి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్ ఎం ఓ రమేష్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily