అక్షరం తెలుగు డైలీ - టెక్నాలజి / : హైదరాబాద్ : దేశంలో 5జీ సేవలు ఇటీవలే లాంఛనంగా ప్రారంభమయ్యాయి. దీంతో ప్రస్తుత 4జీ కంటే ఎంతో వేగంగా ఉండే ఈ 5జీ ఆధారంగా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశీయ మానవ వనరుల విభాగం సంస్థలు సైతం తమ సూచికల్లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొంటుండటం గమనార్హం. మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్, ఎన్ఎల్బీ సర్వీసెస్లు 5జీ సేవల విస్తరణతో ఆయా రంగాల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వెల్లడించాయి. అదనంగా 15-20 శాతం ఉద్యోగాలు వస్తాయంటున్నాయి. టెలికం రంగంతోపాటు రిటైల్, తయారీ, హెల్త్కేర్ వంటి రంగాల్లో కొత్తగా నియామకాలుంటాయని అంచనా వేశాయి. రాబోయే 6 నెలల్లో.. నెట్వర్క్ ఇంజినీర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ల్లో నైపుణ్యం ఉన్నవారికి, యూజర్ ఎక్స్పీరియెన్స్ డిజైనర్లు (యూఐ), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, డాటా అనలిటిక్స్ వంటి స్పెషలైజేషన్లలో ప్రతిభావంతులకు రాబోయే రెండు త్రైమాసికాల్లో 20 శాతం వరకు ఉద్యోగావకాశాలు పెరగవచ్చని ఎన్ఎల్బీ సర్వీసెస్ అంటున్నది. ఈ క్రమంలోనే 5జీతో ఇంటర్నెట్ స్పీడ్ గణనీయంగా పెరగడం వల్ల ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉందని హైదరాబాద్కు చెందిన ఐటీ నిపుణుడు అవినాష్ రాజు అన్నారు. కొత్త టెక్నాలజీలకు ఊపు.. 5జీ రాక.. కొత్త టెక్నాలజీలకు ఊపునిస్తున్నది. ప్రభుత్వ-ప్రైవేటు సంస్థల కార్యకలాపాలకు, ప్రజా అవసరాల కోసం అప్లికేషన్ల రూపకల్పనకు 5జీ ఎంతో దోహదం చేయనున్నది. దేశ వ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తే ఆగ్మెంటెడ్-వర్చువల్ రియాలిటీలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సరికొత్త టెక్నాలజీలకు మరింత జోష్ రానుందని, ఉద్యోగులకూ డిమాండ్ ఉంటుందని టెలికం శాఖ అధికారులు అంటున్నారు. 5జీతో మొబైల్ యాప్ (అప్లికేషన్)ల వినియోగం మరింత పెరుగుతుంది. ఆన్లైన్ ద్వారా బిజినెస్ టు కస్టమర్ సేవలు అందించే కంపెనీలూ ఎక్కువవుతాయి. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర వైఫై, సిమ్ కార్డు ఆధారిత ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరు కూడా మెరుగవుతుంది. వేగంగా లావాదేవీలు జరగడం వల్ల వినియోగదారులకూ ప్రయోజనం చేకూరుతుంది. సరికొత్త ఆవిష్కరణలతో ఇంకా స్టార్టప్లు వచ్చేందుకు వీలుంటుంది. మొత్తంగా అన్ని రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎయిర్టెల్ 5జీ ప్లస్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ దేశీయంగా 5జీ సేవలను ప్రారంభించింది. ఎయిర్టెల్ 5జీ ప్లస్ పేరుతో 8 ప్రధాన నగరాల్లో సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్తోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, సిలిగురి, నాగ్పూర్, వారణాసిల్లో తొలుత ఈ 5జీ సేవల్ని పరిచయం చేసింది. దశలవారీగా మిగతా ప్రాంతాలకూ విస్తరిస్తామని ఎయిర్టెల్ చెప్పగా.. వచ్చే ఏడాది ఆఖర్లోగా దేశ వ్యాప్తంగా ఎయిర్టెల్ 5జీ సేవలు మొదలయ్యే వీలున్నది. కాగా, ఈ 8 నగరాల్లోని 5జీ స్మార్ట్ఫోన్లున్న ఎయిర్టెల్ కస్టమర్లు ప్రస్తుతానికైతే ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 4జీ సిమ్ ద్వారానే, అవే డాటా ప్లాన్స్పైనే 5జీ ప్లస్ సేవల్ని పొందవచ్చని ఎయిర్టెల్ ప్రకటించింది. ఇక ఇప్పుడున్న 4జీ స్పీడ్ కంటే 20-30 రెట్లు అధికంగా 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుందని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. మరింత వేగంగా డౌన్లోడ్, నాణ్యమైన విజువల్స్తోపాటు క్లౌడ్ స్ట్రీమింగ్ కంటెంట్, క్లౌడ్ గేమింగ్లలో కొత్త అనుభూతిని వినియోగదారులు పొందుతారన్నది.
.
Aksharam Telugu Daily