అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : 12:37కు సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరణ అతిథులుగా అఖిలేశ్, కుమారస్వామి రాజశ్యామల హోమం, నవచండీ యాగం ఢిల్లీకి చేరిన మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఇంతకుముందు ఏ తెలంగాణవాడూ, మరే తెలుగు నేతా చేయని, చేయలేని పని ఇది. ఆ మాటకొస్తే దేశంలోని మరే నాయకుడికీ దక్కని ఖ్యాతి ఇది. హక్కుల కోసం నినదించి, అస్తిత్వ ఉద్యమ పతాక ఎగరేసి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి, ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీగా మార్చి, అప్రతిహత ఆధిక్యంతో అధికారంలోకి వచ్చి, తెచ్చిన రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి చూపించి, ఆ నమూనాను దేశానికి పరిచయం చేయడం, ఆ నమూనాయే ఎజెండాగా జాతీయ పార్టీకి ఊపిరి పోయడం.. ఇది కేవలం కేసీఆర్కు మాత్రమే సాధ్యమైన పని. పలు ప్రాంతీయ పార్టీలు సాంకేతికంగా జాతీయ హోదా సాధించి ఉండవచ్చు. కానీ ఒక ప్రాంతీయ పార్టీ పరిపూర్ణ జాతీయ ఎజెండాతో దేశ రాజకీయ యవనికపై ఆవిర్భవించడం మాత్రం ఇదే తొలిసారి. తెలుగు నేలపై ఆవిర్భవించిన ఒక పార్టీ జాతీయ స్థాయిలో జెండా ఎగరేసి, దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున సగర్వంగా కార్యాలయాన్ని స్థాపించుకోవడం ఇదే మొట్టమొదటిసారి. ఇది ఒక తెలంగాణ వాడికి మాత్రమే సాధ్యమైంది. ఒక కేసీఆర్కు మాత్రమే సాధ్యమైంది. న్యూఢిల్లీ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి: దేశ రాజకీయాల్లో అపూర్వఘట్టానికి తెరలేవబోతున్నది. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు.. బుధవారం ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ నడిబొడ్డున సర్దార్ పటేల్ రోడ్డులో బుధవారం బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:37 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి జేడీఎస్ నేత కుమారస్వామి, సమాజ్వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్తోపాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. యాగంతో మొదలు బుధవారం మధ్నాహ్నం 12 గంటలకు పార్టీ కార్యాలయానికి కేసీఆర్ చేరుకొంటారు. అక్కడ నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో వేదపండితులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణ శర్మలతోపాటు వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర తేజ తదితరులు యాగ క్రతువులో భాగస్వామ్యులయ్యారు. మంగళవారమే గణపతి పూజతో యాగం మొదలయ్యింది. పూర్ణాహుతి అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకొని తన కార్యాలయంలో కుర్చీలో ఆసీనులవుతారు. పార్టీకి సంబంధించిన పత్రాలపై సంతకం చేస్తారు. బీఆర్ఎస్ కోసం ఢిల్లీలోని వసంత్ విహార్లో సొంత భవనం నిర్మిస్తున్నారు. మరో ఐదారు నెలల్లో ఇది సిద్ధమవుతుంది. బుధవారం నవచండీ హోమం కూడా నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను, యాగశాలను సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి తదితరులు మంగళవారం పరిశీలించారు. మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వీ శ్రీనివాస్గౌడ్, చామకూర మల్లారెడ్డి, గంగుల కమలాకర్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, శంభీపూర్రాజు, తాతా మధు తదితరులు మంగళవారం పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. అతిథులుగా అఖిలేశ్, కుమారస్వామి బీఆర్ఎస్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖ నేతలు హాజరవుతున్నట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్, జనతాదళ్ (ఎస్) నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితోపాటు రైతు ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు వస్తున్నారు. బీహార్కు చెందిన ప్రభాత్కుమార్, ఉత్తరాఖండ్ నుంచి పీసీ తివారీ, మహారాష్ట్రకు చెందిన మాణిక్ కదం, ఉత్తర్ప్రదేశ్ నుంచి డాక్టర్ రాకేశ్ రఫీక్, ఒడిశాకు చెందిన అక్షయ్కుమార్, హర్యానా నుంచి గుర్నాంసింగ్ చదానీ, పంజాబ్, మహారాష్ర్టకు చెందిన పలువురు రైతు సంఘాల నేతలు కూడా రానున్నట్టు సమాచారం. వేలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకొన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్పర్సన్లు, జడ్పీ, మున్సిపల్ చైర్పర్సన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్పర్సన్లు, సామాన్య కార్యకర్తలు అనేకమంది ఇప్పటికే ఢిల్లీకి చేరుకొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానాల్లో 90 శాతానికిపైగా బీఆర్ఎస్ పార్టీ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చినవారే ఉన్నారు. విమానాశ్రయంలో, విమానాల్లో కూడా బీఆర్ఎస్ జెండాలను ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే నాయకులను సమన్వయం చేయడానికి టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి, టీఎస్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేశారు. విమానాశ్రయం వద్ద, తెలంగాణభవన్, అశోకా, రాయల్ ప్లాజా హోటళ్ల వద్ద సమన్వయకర్తలను నియమించారు. ప్రజల సమస్యలే ఎజెండా: వేముల ప్రజాసమస్యల పరిష్కారమే ఎజెండాగా బీఆర్ఎస్ ఏర్పడిందని మంత్రి ప్రశాంత్రెడ్డి చెప్పారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యాల య ప్రారంభోత్సవానికి పలు రాష్ర్టాలకు చెంది న రైతు సంఘాల నేతలు హాజరవుతున్నారని తెలిపారు. భావసారుప్యత ఉన్న రాజకీయ పార్టీల నేతలు కూడా వస్తున్నారని వెల్లడించా రు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశవ్యాప్తంగా జరగాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. దేశంలో ఇప్పటికీ తాగునీరు అందక ప్రజలు అల్లాడుతున్నారని, ప్రాజెక్టులు కట్టి ప్రజలకు సాగు, తాగునీటిని అందించలేకపోతున్నారని అన్నారు. దేశం కొంత మంది గుప్పిట్లో ఉన్నదని, ఈ పద్ధతులు మారాలన్నదే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. దేశంలో విప్లవాత్మక మార్పు రావాలని కోరుకొంటున్నామని, దీనికోసమే బీఆర్ఎస్ ఏర్పడిందని పేర్కొన్నారు. శాశ్వత భవన నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్ ఢిల్లీలోని వసంత్ విహార్లో నిర్మాణంలో ఉన్న బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ మంగళవారం సందర్శించారు. నిర్మాణ పనుల తీరును అడిగి తెలుసుకొన్నారు. సుమారు గంటకుపైగా ఇక్కడ ఉన్నారు. సీఎం వెంట రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్ తదితరులు ఉన్నారు. భవనానికి సంబంధించిన కొలతలను సీఎం దగ్గర ఉండి చేయించారు. గదులు, హాలు, పార్కింగ్, ప్రధాన ద్వారం తదితర వాటికి సంబంధించి పలు సూచనలు చేశారు. మరో 5-6 నెలల్లో నూతన భవన నిర్మాణ పనులు పూర్తి అవుతాయని పనులు చేస్తున్నవారు వివరించారు.
.
Aksharam Telugu Daily